నెహ్రూసెంటర్. ప్రకృతి విపత్తుల సమయంలో విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు విద్యుత్శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాల వల్ల అంతరాయాలు ఏర్పడిన వెంటనే విద్యుత్ పునరుద్ధరించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీంలో వాహనాలతో పాటు సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఈ మేరకు మహబూబాబాద్ సర్కిల్ పరిధిలో 2 ఈఆర్టీ (ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్) వాహనాలు, టీంను సిద్ధం చేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అంతరాలు లేకుండా, విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో..
సబ్డివిజన్ స్థాయిలో 7 వాహనాలను సిద్ధంగా ఉంచామని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ వాహనాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ తదితర మెటీరియల్ ముందుగానే అందుబాటులో ఉంచుకొని, సమస్య వచ్చిన ప్రాంతానికి బృందాన్ని వెంటనే పంపించి వేగంగా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
ప్రకృతి విపత్తుల సమయంలో..
ఈ ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాల ద్వారా హఠాత్తుగా సంభవించే భారీ వర్షాలు, ఈదురు గాలులు, పోల్స్ కూలిపోవడం వంటి సమస్యలను పరిష్కరిస్తారు. ఈఆర్టీ వాహనాలపై 1912 అని టోల్ ఫ్రీ నంబర్ ముద్రించి ఉంటుందని, ఎటువంటి సమస్యలకై నా ఈ నంబర్లో సంప్రదించవచ్చు. 24గంటలు నంబర్ అందుబాటులో ఉంటుంది.
నిరంతర విద్యుత్ సరఫరా
నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది. ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విద్యు త్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తుంది. అందుకోస మే ఎమర్జెన్సీ రిస్టోరేషన్ టీమ్లను ఏర్పాటు చేసింది. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు.
– విజయేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్స్ ఏర్పాటు
ప్రత్యేక వాహనాలు సైతం సిద్ధం


