● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్మి మల్లారెడ్డి
మహబూబాబాద్: కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, మినిమం బేసిక్ పే చెల్లించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య భద్రతతో పాటు హెల్త్ కార్డులు, నగదు రహిత వైద్యం అందించాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవులు ఇవ్వాలని మొదటి పీఆర్సీ సిఫార్సు మేరకు ప్రతీ సంవత్సరం వెయ్యి రూపాయల చొప్పున పెంచాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేని యెడల ఈనెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు స్వప్న, మంజుల, హరి, సంజీవ తదితరులు పాల్గొన్నారు.
సమయపాలన పాటించని ఉపాధ్యాయులు!
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో సోమవా రం ఒంటిపూట బడులు ప్రారంభం కాగా.. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయానికి హాజరుకాలేదు. కాగా, వారు వచ్చే వరకు తాళాలు తీయలేదు. దీంతో విద్యార్థులకు ఎదురుచూపులు తప్పలేదు. ఏటిగడ్డ గిరిజన తండా ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉదయం 7:40గంటలకు హాజరుకావాల్సి ఉండగా.. 8:20గంటలు దాటినా రాలేదు. దీంతో పాఠశాల గదుల తాళాలు తీయలేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


