హన్మకొండ అర్బన్ : హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో ఆదివారం తెలంగాణ హమాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హమాలీ మహా గర్జన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హనుమకొండ కేంద్రంలో హమాలీల కోసం భూమి కేటాయించడంలో కృషి చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హమాలీలు రక్తాన్ని చెమటగా మార్చి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. హమాలీలకు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ బోర్డు ఏర్పాటు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ వంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొద్దిపాటి ఆలస్యం జరిగినా హామీలను తప్పకుండా నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుడు తన కష్టంతో సంపాదించే వ్యక్తి అని, సమాజాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమన్నారు. హమాలీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హమాలీల సంక్షేమం కోసం తన వంతు సాయంగా సీడీఎఫ్ నుంచి రూ.20 లక్షలు విడుదల చేస్తానని ప్రకటించారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హమాలీలు అంబేడ్కర్ జంక్షన్ నుంచి నిర్వహించిన భారీ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, రచయిత మిట్టపల్లి సురేందర్, గాయకులు చుక్క రాంనర్సయ్య, హమాలీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం, ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క


