శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేటి(శనివారం) నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. కాగా, జిల్లాలో 45 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా.. కావా ల్సిన మౌలిక వసతులు కల్పించారు. ఇదిలా ఉండగా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షల నిర్వహణ కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.
నిబంధనలు పాటించాలి..
విద్యార్థులు ముందుగా పరీక్ష కేంద్రాలకు వెళ్లి తమ హాల్టికెట్ నంబర్ను పరిశీలించుకోవాలని డీఈఓ రాజేశ్వర్ సూచించారు. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. హాల్ టికెట్లో ఏమైనా తప్పులు దొర్లితే ముందుగానే సరి చూసుకోవాలని డీఈఓ సూచించారు.
కట్టుదిట్టమైన బందోబస్తు..
జిల్లాలో దంతాలపల్లి, తొర్రూరు, గార్ల మండలాల్లోని పలు సమస్యాత్మక కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఆరోపణలు, జరిగిన మాల్ప్రాక్టిస్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేశారు.
స్క్వాడ్ సిబ్బంది..
జిల్లాలో 45 పరీక్ష కేంద్రాల్లో 45 సిట్టింగ్ స్క్వాడ్, మూడు బృందాల చొప్పున ఫ్లయింగ్, రూట్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. 435మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే మూడు నెలల నుంచి ఏడాది పాటు జైలు శిక్ష, రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.
పదో తరగతి పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులుగా ఉండొద్దు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారం నిర్వహించొద్దు. పరీక్ష జరుగుతున్న సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలి. ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలులో ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది. నింబధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి. – శబరీష్, ఎస్పీ
●
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..
అన్ని పరీక్ష కేంద్రాల వల్ల 144 సెక్షన్ అమలు చేసి, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని, ఇన్విజిలేటర్లు, సిబ్బంది, సీఎస్లు, చీఫ్ సూపరిండెంటెంట్లు, అధికారులు, విద్యార్థులు సెల్ఫోన్లు, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావొద్దని, ఎవరైనా తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా విద్యార్థులు చెప్పులు మాత్రమే ధరించి పరీక్షకు హాజరుకావాలని సూచించారు. ఎవరైనా మాల్ ప్రాక్టిస్కు పాల్పడినా, ప్రోత్సహించినా అలాంటి వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జిల్లాలో 45కేంద్రాలు..
కట్టుదిట్టమైన బందోబస్తు
సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల నిషేధం
హాజరుకానున్న
8,178మంది విద్యార్థులు


