● రాజమౌళి భౌతికయానికి నివాళుల
ర్పించిన వివిధ పార్టీల నాయకులు
గీసుకొండ: గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన తమ నాయకుడు ఇక లేడని తెలిసి గంగదేవిపల్లి వాసులు రోదించారు. గ్రామ అభివృద్ధి ప్రదాత కూసం రాజమౌళి గుండెపోటుతో ఆదివారం సాయంత్రం మృతి చెందాడన్న వార్త తెలియగానే గ్రామం నుంచి బయటకు పనులపై వెళ్లిన వారంతా తిరిగి వచ్చి ఆయన భౌతికయాన్ని సందర్శించి ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. రాత్రి వరకు బంధువులతో పాటు సమీప గ్రామాల ప్రజలు, ఆయన అభిమానులు, సీపీఎం, ఎంసీపీఐ (యూ)నాయకులు గ్రామానికి చేరుకున్నారు. దేశ విదేశాల వారు అబ్బురపడేలా గ్రామాన్ని జాతీయస్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దిన తమ నాయకుడు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీపీఎం పార్టీ నాయకులు పార్థ్దివ దేహంపై కండువా కప్పి నివాళులర్పించగా, ఎంసీపీఐ(యూ) నాయకులు అమరహే రాజమౌళి అంటూ నినాదాలు చేశారు. నేడు (సోమవారం) రాజమౌళి అంత్యక్రియలను నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ సంతాపం
రాజమౌళి మృతి పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్థం తెలిపి, దేశానికి ఆదర్శంగా గంగదేవిపల్లిని నిలపడంలో ఆయనది కీలక పాత్ర అని కొనియాడారు. ఆయన మరణం దేశ పంచాయతీరాజ్ వ్యవస్థకు తీరని లోటని, తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పల్లె ప్రగతి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో రాజమౌళి అనుభవాలను తీసుకున్నామన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


