నేడు కేసముద్రంలో మంత్రుల పర్యటన
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్క, శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, ఎంపీ పోరిక బలరాంనాయక్ శనివారం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణ, 50 పడకల ఆస్పత్రి, శ్రీశక్తి భవన్ నిర్మాణాలు, మున్సిపాలిటీలోని 16 వార్డుల అంతర్గత అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ స్థలాన్ని, జ్యోతిరావుపూలే సెంటర్ సమీపంలోని సభావేదిక స్థలాన్ని ఎస్పీ శబరీష్ శుక్రవారం పరిశీలించారు. అదేవిధంగా వీఐపీ రూట్మ్యాప్, పార్కింగ్ ప్రదేశాలు, ప్రజల రాకపోకల నియంత్రణ ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సత్యనారాయణ, ఎస్సైలు క్రాంతికిరణ్, రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు.
మానుకోటలో..
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సీఎం సలహాదారు, ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యే హాజరవుతున్నారని అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజయ్య శుక్రవారం తెలిపారు. శనివారం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్క వాకి టి శ్రీహరి, ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా హాజరవుతారన్నారు. రూ.60 కోట్లతో చేపట్టనున్న పనులకు మధ్యాహ్నం 3 గంటలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సాయంత్రం 4గంటలకు బాలాజీ గార్డెన్ లో మున్సిపాలిటీ ఎన్నికలపై ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని, 4.30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మానుకోట, మరిపెడ, డోర్నకల్, ఇల్లెందు మున్సిపాలిటీల వారీ గా సమావేశంలో పాల్గొంటారన్నారు.
హెలిపాడ్, సభా స్థలిని పరిశీలించిన ఎస్పీ శబరీష్


