
కాంగ్రెస్ ఇన్చార్జ్గా అడ్లూరి లక్ష్మణ్కుమార్
● సంస్థాగత నిర్మాణంపై పార్టీ దృష్టి
● వీరి ఆధ్వర్యంలో గ్రామ,
మండల, జిల్లా కమిటీలు!
సాక్షిప్రతినిధి, వరంగల్: సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని మరింత బలోపేతం చేయడంపై కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇటీవలి పర్యటన తర్వాత ఆ పార్టీ హైకమాండ్ దూకుడు పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించిన అధిష్టానం.. సోమవారం ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్లను నియమించింది. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్కు పార్టీ ఇన్చార్జ్గా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ను నియమించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్కుమార్ గతంలో ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా.. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కగా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖను కేటాయించారు. నల్లగొండ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న లక్ష్మణ్కుమార్ పార్టీ ఉమ్మడి వరంగల్ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్లో ఇటీవల నెలకొన్న గ్రూపు రాజకీయాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ సోమవారం లక్ష్మణ్కుమార్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఘట్టం మొదలవనుండగా.. సమర్థంగా ఎదుర్కొనేందుకు సంస్థాగత కమిటీలు పూర్తి చేసేందుకు అన్ని స్థాయిల్లో కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జ్ లను నియమించిన అధిష్టానం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే వీరి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంతో గ్రామ, మండల, జిల్లా కమిటీలను పూర్తి చేసే బాధ్యతలను అప్పగించినట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది.