
అక్రమార్కులు ఎవరు..
టీజీఎన్పీడీసీఎల్లో సబ్ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు
హన్మకొండ : సబ్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్లో జరిగిన అక్రమాలకు బాధ్యులను గుర్తించడంలో తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీ ఎన్పీడీసీఎల్) విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రత్యేకంగా నియమించిన అత్యున్నత స్థాయి విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. ఇది జరిగి నెలలు గడిచిపోతున్నాయే కాని ఇప్పటి వరకు బాధ్యులను గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని కాపాడడంలో ఉన్న ఆంతర్యమేమిటని విద్యుత్ ఉద్యోగ వర్గాలతో పాటు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
అక్రమాల్లో ఉన్నతాధికారిదే హస్తం..
ఈ అక్రమాల్లో మానవ వనరుల విభాగం ఉన్నతాధికారిదే హస్తం ఉందని విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మానవ వనరుల విభాగానికి కీలకంగా వ్యవహరించిన ఆ పాలకవర్గ సభ్యుడు అంతా తానై సబ్ ఇంజనీర్ల నియామక ప్రక్రియ పూర్తి చేశాడని, ఇందులో తనకు ఏ మాత్రం సంబంధం లేదని నియామకాల ప్రక్రియ చూసుకునే కీలక ఇండస్ట్రీయల్ రిలేషన్స్ విభాగ అధికారి సహ అధికారులు, ఉద్యోగుల ఎదుట తన బాధ చెప్పుకుంటున్నారని చర్చ సాగుతోంది. దీంతో నియామక ప్రక్రియలో అక్రమాలతో తనకు సంబంధం లేదని ఆయన చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ కీలక అధికారిపై పలు ఆరోపణలుండడంతో మానవ వనరుల విభాగం కీలక బాధ్యుడు, పాలక మండలి సభ్యుడు నియామకాల ప్రక్రియతో సంబంధం లేని మరో జనరల్ మేనేజర్ సాయంతో అంతా తానై చూసుకున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది. కాగా, పదవీచ్చుతుడైన మాజీ పాలక వర్గ బాధ్యుడు ఈ ఉచ్చులో చిక్కుకోనున్నాడా అనే సందేహాలు విద్యుత్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అక్రమాలు వాస్తవాలని తెలిసినా యాజమాన్యం ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదో అర్థం కావడం లేదని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు.
24 పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన కమిటీ..
టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు 497 సబ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి 2018 మే 24న నోటిఫికేషన్ జారీ చేశారు. అదే ఏడాది జూలై 8న రాత పరీక్ష నిర్వహించారు. ఆగస్టు 31న ఫలితాలు ప్రకటించారు. డిసెంబర్లో నియామకాలు చేపట్టారు. ఇందులో ముందుగా కాల్ లెటర్లు పంపిన 24 మందిని కాకుండా ఇతరులతో భర్తీ చేశారు. ఇక్కడే అక్రమాలకు బీజం పడింది. కాల్ లెటర్ అందుకుని ఉద్యోగాలు రాని అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో నిర్వహించిన ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విచారణ చేపట్టింది. టీజీ పీఎస్సీ నుంచి ఒక అధికారి, టీఎస్ ఎస్పీడీసీఎల్ నుంచి ఇద్దరు, టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి ఇద్దరు అధికారులతో కూడిన కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. ఇందులో 24 పోస్టుల భర్తీలో అక్రమాలకు జరిగినట్లు గుర్తించింది. అర్హులు కాని వారు ఉద్యోగాలు పొందినట్లు గుర్తించిన విచారణ కమిటీ.. యాజమాన్యానికి నివేదిక అందించింది. ఈ నివేదిక మేరకు అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారికి నోటీసు జారీ చేయగా వారు కోర్టుకెళ్లారు. కోర్టు స్టే ఇవ్వడంతో ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అయితే అన్యాయం జరిగిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కమిటీ నిజాలు నిగ్గు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..
టీజీ ఎన్పీడీసీఎల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మానవ వనరుల విభాగంలోని ఇండస్ట్రీయల్ విభాగం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో సబ్ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు వెలుగు చూసినా ఎలాంటి చర్య తీసుకోకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగులు చిన్న తప్పులు చేస్తే చర్యలు తీసుకునే యాజమాన్యం.. ఇంత పెద్ద అక్రమం జరిగినా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఆకాశరామన్న ఉత్తరాలు (పేరు లేని వినతులు) రాస్తే భూతద్దంలో పెట్టి చూస్తున్న యాజమాన్యం... ఆ యాజమాన్యం వేసిన విచారణ కమిటీ నిజాలు నిగ్గు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోకుండా నాన్చివేతధోరణి అవలంబించడంలో ఉన్న మతలబేమిటని ప్రశ్నిస్తున్నారు. చిన్న తప్పులకు ఉద్యోగులకు పెద్ద పనిష్మంట్లు ఇచ్చే యాజమాన్యం, పెద్ద తప్పు చేసిన ఉన్నతాధికారులకు ఎలాంటి శిక్షలు ఉండవా అని నిలదీస్తున్నారు. సంస్థ వీలైనంత త్వరగా అక్రమార్కులపై చర్యలు తీసుకుని నిజాయితీ చాటుకోవాల్సిన అవసరం ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు
విచారణ ముగిసి నెలలు గడుస్తున్నా అక్రమార్కులను గుర్తించని వైనం
మానవ వనరుల విభాగంలో అప్పటి ఉన్నతాధికారిదే హస్తమని చర్చ
తన ప్రమేయం లేదంటున్న ఇండస్ట్రీయల్ విభాగం కీలక అధికారి
బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవడంపై యాజమాన్యం తాత్సారం
పెద్దలు తప్పు చేస్తే మినహాయింపేనా..! ప్రశ్నిస్తున్న ఉద్యోగులు

అక్రమార్కులు ఎవరు..