ఉమ్మడి జిల్లాలో
ఖరీఫ్ ప్రధాన పంటల
సాధారణ సాగు ఇలా..
అన్నదాత సుఖీభవ సాయాన్ని టీడీపీ ప్రభుత్వం మొదటి ఏడాది ఎగ్గొట్టి రెండవ ఏడాది అరకొరగా అమలు చేసింది. పంటల బీమాను నిర్వీర్యం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇంతవరకు చినుకు జాడ లేదు. మాకు 10 ఎకరాల భూమి ఉంది. వేరుశనగ, ఆముదం, కంది, సజ్జ వంటి పంటలు వేస్తాం. ఇంతవరకు విత్తనాల పంపిణీ చేపట్టకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పటికై నా ఉచిత పంటల బీమా సదుపాయాన్ని కల్పించాలి.
– రాజు నాయక్, పెండ్లిమాన్తండా,
పత్తికొండ మండలం
మాకు 15 ఎకరాల భూమి ఉంది. ఉల్లి, వేరుశనగ, కంది, సజ్జ, ఆముదం వంటి పంటలు సాగు చేస్తాం. రసాయన ఎరువుల ధరలు అడ్డుగోలుగా పెరిగిపోయాయి. 50 కిలోల బస్తా కాంప్లెక్స్ ఎరువు ధర రూ.2,450 వరకు ఉంది. ఎరువుల ధరల కారణంగా పెట్టుబడి వ్యయం అధికమవుతోంది. ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ వర్షాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోవడం తగదు.
– రామచంద్రుడు, కొచ్చెర్వు, డోన్ మండలం
● గతంలో ఎప్పుడూ లేనంత
పెట్టుబడి సమస్య
● పంట రుణాల పంపిణీలో
బ్యాంకుల నిర్లక్ష్యం
● ఎల్నినో ప్రభావంతో
జాడలేని రుతుపవనాలు
● అప్పుడే మొదలైన
యూరియా కొరత
● ఈసారి యాప్ ద్వారా
పంపిణీకి ఏర్పాట్లు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ఆరంభానికి ముందే యూరియా సమస్య రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతీగతీ లేని విత్తన పంపిణీ, పెట్టుబడి కష్టాలతో రైతులు చుక్కలు చూస్తున్నారు. ఇప్పటివరకు వర్షపు చినుకే లేని మండలాలు ఉమ్మడి జిల్లాలో 46 ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి చేయూత లేకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది అధిక వర్షాలతో కోలుకోలేని విధంగా నష్టపోయిన రైతులు ఈ ఖరీఫ్ సీజన్పై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎల్నినో ప్రభావంతో ఈ సారి వర్షాలు నిరాశజనకంగా ఉంటాయని భారత వాతావరణ విభాగం కొద్ది నెలలుగా హెచ్చరిస్తోంది. ఇదిలాఉంటే ఖరీఫ్ రైతులను పెట్టుబడుల సమస్య వేధిస్తోంది. 2019–20 నుంచి 2023–24 వరకు ఖరీఫ్ సీజన్కు ముందే వైఎస్ఆర్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం విడుదల చేస్తుండటం రైతులకు ఊరటనిచ్చింది. అంతేగాక ఉచిత పంటల బీమా పరిహారం కూడా ఖరీఫ్ సీజన్కు ముందే విడుదల చేస్తుండటం రైతులకు పెట్టుబడి కష్టాలను దూరం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్ 12న ఏర్పాటైనప్పటికీ మొదటి ఏడాది సూపర్–6లో ప్రకటించిన అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు చెల్లించడంలో చేతులెత్తేసింది. 2025–26 సంవత్సరంలో అమలు చేసినప్పటికి తూతూ మంత్రంగానే అమలు చేసింది. ఇక కౌలుదారులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
అంకెల్లోనే
పంట రుణాల పంపిణీ
పంట రుణాల పంపిణీ అంకెల గారిడీకే పరిమితమవుతోంది. 2025–26 ఖరీఫ్లో రూ.3,635.62 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ.4213.03 కోట్లు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి. 2026–27లో రూ.4,241.54 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు పాత రుణాలను రెన్యూవల్ చేయడం మినహా కొత్త రుణాలు పంపిణీ చేస్తున్న దాఖలాలు లేవు. బ్యాంకులు సహకరించకపోవడం, ప్రభుత్వం చేయూత ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
విత్తన సమస్య
ఖరీఫ్ సీజన్లో మొత్తం 6,87,441హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో ప్రధానంగా పత్తి, వేరుశనగ, కంది, ఉల్లి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలు.. నంద్యాల జిల్లాలో వరి, మొక్కజొన్న, మినుము, కంది, పత్తి సాగు చేయనున్నారు. కొద్ది రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. కానీ విత్తన సమస్య రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా మే నెల 15 నుంచి ఆర్బీకే స్థాయిలోనే విత్తనాల పంపిణీ జరిగింది. ఈ సారి ఖరీఫ్ సీజన్లో విత్తన పంపిణీని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇదే సమయంలో పత్తిలో నకిలీ విత్తనాలు, విత్తన ప్యాకెట్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. హెచ్టీ పత్తి విత్తనాలకు అనుమతి లేకపోయినప్పటికీ మార్కెట్లో విచ్చలవిడగా లభిస్తుండటం గమనార్హం.
భయపెడుతున్న ఎల్నినో
ఎల్నినో రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఖరీఫ్ మొదలైనప్పటికీ ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. ఎల్నినో ప్రభావం ఆగస్టు వరకు ఉంటుందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే ప్రకటించింది. వర్షాలు ప్రతి నెల సాధారణం కంటే అతి తక్కువగా నమోదయ్యే అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల జూన్ నుంచి ఆగస్టు వరకు వేడి వాతావరణం అధికంగా ఉండి పంటల దిగుబడిపై ప్రతికూల ప్రబావం చూపనున్నాయి. మామూలుగా మే నెల చివరి నాటికి నైరుతి రుతుపవనాలు విస్తరించాలి. ఈ పాటికి తొలకరి మొదలవ్వాలి. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు చురుకుతనాన్ని కోల్పోయాయి. గాలిలో తేమ తగ్గిపోయింది. ఇందువల్ల వడగాలులు తీవ్రత కొనసాగుతోంది. ఈ సారి ప్రధాన పంటలైన వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న సాగు కష్టమేనన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
పంట కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా
(హెక్టార్లలో) (హెక్టార్లలో)
వరి 13,343 70,201
మొక్కజొన్న 6,143 61,615
కంది 42,719 38,192
పత్తి 2,39,774 15,165
మినుము --- 10,188
ఉల్లి 19,242 4,583
వేరుశనగ 44,308 8,694
మిర్చి 37,642 12,028


