● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
● ‘సర్’పై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆధ్వర్యంలో కార్యకర్తలకు అవగాహన
ఆలూరు రూరల్: గ్రామాల్లో ఓటరు నమోదు ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) కీలకమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి అధ్యక్షతన, వైఎస్సార్సీపీ బీఎల్ఏ ఆలూరు నియోజకవర్గ అధ్యక్షుడు సుధాకర్ సమక్షంలో ఎస్ఐఆర్పై ఆలూరులో బీఎల్ఏలకు శనివారం అవగాహన కల్పించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఆలూరు నియోజకవర్గ పరిశీలకుడు రామచంద్రా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలూరు నియోజకవర్గంలో 315 మందిని బూత్ ఏజెంట్లుగా నియమించారన్నారు. వీరంతా ఓటరు నమోదు ప్రక్రియలో సైనికుల్లా పనిచేయాలన్నారు. వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను తొలగించే ‘కూటమి’ కుట్రలను అడ్డుకోవాలన్నారు. ఓటర్ల్ల తుది జాబితా విడుదలయ్యే వరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్రీన్పై వివరించారు. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని 2025 ఓటర్ల మ్యాపింగ్ జరుగుతుందన్నారు.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా
నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. త్వరలో వచ్చే స్థానిక సంస్థల్లో, 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలని పిలుపు నిచ్చారు. ఓటరు సవరణ కార్యక్రమంలో బీఎల్ఏలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య, గుంతల రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా టీడీపీ ఆలూరు ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితమయ్యారన్నారు.
క్రమశిక్షణతో నిర్వర్తించాలి
ఆలూరు నియోజకవర్గ పరిశీలకుడు రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం అప్పజెప్పిన బాధ్యతను 315 మంది బీఎల్ఏలు క్రమశిక్షణతో నిర్వర్తించాలన్నారు. వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలం అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా నిలబడి పనిచేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ నాయకులు తెర్నేకల్ సురేందర్ రెడ్డి, శశికళ, వైకుంఠం మల్లికార్జున చౌదరి, సౌమ్యారెడ్డి, దివాకర్ నాయుడు, మధుసూధన్ రెడ్డి, బూత్ లెవెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సుధాకర్, వైఎస్సార్సీపీ వివిధ విభాగాల జిల్లా నాయకులు, ఆరు మండలాల కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు,మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
టీడీపీ.. వెన్ను పోటు పార్టీ
సూపర్సిక్స్ అనే అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన టీడీపీ వెన్నుపోటు పార్టీ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు వెన్నపోటు పొడిచాడన్నారు. నంద్యాల జెడ్పీటీసీ సభ్యుడు రమేష్ను, ఆలూరులో ఈరన్న అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారని, హత్యా రాజకీయాల చరిత్ర టీడీపీది కాదా అని ప్రశ్నించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు రాక్షసులతో యుద్ధం చేస్తున్నారన్నారు. మోసపూరిత హామీలతో పాలన సాగిస్తూ.. ప్రశ్నించిన వారిపై టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు.


