విక్రాంత్ పాటిల్
కర్నూలు: ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఆదివారం ఉన్న నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శనివారం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి గంజాయి అమ్మేవారిని, సేవించే వారిని డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో తనిఖీలు నిర్వహించాలన్నారు. లైంగిక నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై షీట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు. వారికి జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఏడాది కాలంలో శిక్ష పడిన నేరస్తుల వివరాలు సేకరించి నిఘా కొనసాగించాలన్నారు.
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
మిస్సింగ్ కేసులు, చోరీకి గురైన వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్టీజీఎస్, సీసీటీవీ 360 అప్లికేషన్ ద్వారా వస్తున్న అలర్ట్లను ప్రతిరోజూ సమీక్షించాలన్నారు. సీసీటీవీ ఏపీ 360 అప్లికేషన్ను సమర్థవంతంగా వినియోగించాలని, 1930 సైబర్ హెల్ప్లైన్కు వచ్చిన కాల్స్పై వెంటనే స్పందించాలన్నారు. రూ.10 లక్షలకు పైగా జరిగిన సైబర్ మోసాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారి నుంచి జరిమానాలు కోర్టుకు మాత్రమే చెల్లించే విధంగా చూడాలన్నారు. ఈ విషయంలో ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. సంవత్స రం క్రితం బదిలీ అయిన పోలీసు సిబ్బందిని పాత పోలీస్స్టేషన్లోనే కొనసాగించకుండా బదిలీల్లో వారికి కేటాయించిన స్టేషన్లలో విధులు నిర్వహించేలా చర్య లు తీసుకోవాలన్నారు. లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, భార్గవి తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎస్పీ


