కోవెలకుంట్ల: పట్టణంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. శనివారం కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నటువ మనోహర్ (30) హోటల్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నెకు చెందిన భువనేశ్వరితో ఏడాదిన్నర క్రితం వావాహమైంది. శుక్రవారం రాత్రి హోటల్ పని ముగించుకుని భార్య పుట్టింటి వద్ద ఉండటంతో బైక్పై బయలు దేరాడు. మండలంలోని కంపమల్ల– గోవిందిన్నె ఆర్అండ్బీ రహదారిలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. రాత్రివేళ ఆ రహదారిలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో రోడ్డు ప్రమాద సంఘటనను ఎవరూ గమనించ లేదు. తెల్లవారుజామున అటుగా వెళుతున్న వాహన చోదకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే మృతి చెందినట్లు భావించి శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్ఐ పేర్కొన్నారు.


