● కర్నూలు, నంద్యాల పోలీసు
అధికారుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
● ఇరు జట్లకు కెప్టెన్లుగా
వ్యవహరించిన ఎస్పీలు
కర్నూలు: విధి నిర్వహణలో మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న పోలీసు అధికారులు ఆటవిడుపుగా కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ మైదానంలో ఆదివారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఇందులో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇరు జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్కు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ కెప్టెన్లుగా వ్యవహరించారు. పోలీసు సిబ్బందిని ఉత్సాహపరుస్తూ సాగిన ఈ మ్యాచ్లో నంద్యాల జిల్లా పోలీస్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్లు పోలీసుల్లో ఒత్తిడిని తగ్గించడంతో పాటు శారీరక ధారుడ్యాన్ని పెంచుతాయన్నారు. నంద్యాల ఎస్పీ మాట్లాడుతూ.. కర్నూలు, నంద్యాల జిల్లాల పోలీసుల మధ్య స్నేహ పూరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు. క్రీడలు శారీరక ధృడత్వానికి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సుధాకర్, శ్రీనివాసులుతో పాటు సీఐ, ఆర్ఐ, ఎస్ఐ, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.


