కర్నూలు(హాస్పిటల్): వైద్యులు ఆధునిక వైద్య విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కర్నూలు మెడికల్ కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ చెప్పారు. కళాశాలలో ఆదివారం జనరల్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో జోనల్ స్థాయి నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు (సీఎంఈ) నిర్వహించారు. ఈ సదస్సుకు కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల జనరల్ మెడిసిన్ పీజీ విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో సాధారణ వ్యాధులు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, మెటబాలిక్ డిస్ ఫంక్సన్, క్యాన్సర్ చికిత్స మొదలైన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ వైద్యులు, వైద్య విద్యార్థులు వైద్య కాన్ఫరెన్స్లు, సీఎంఈలలో పాల్గొని వైద్య రంగంలో వస్తున్న ఆధునిక విజ్ఞానాన్ని తెలుసుకుని అప్డేట్ కావాలన్నారు. కార్యక్రమంలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీరాములు, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీబాయి, విశ్వభారతి మెడికల్ కాలేజి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ రవికళాధర్రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి ప్రొఫెసర్లు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ మోహన్రెడ్డి, డాక్టర్ సాయిసంపత్కుమార్, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


