శ్రీశైలం టెంపుల్: శ్రీశైల శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సోమవారం శ్రీశైలం చేరుకున్న సినీ హీరో శ్రీకాంత్ దంపతులు ఉదయం బ్రేక్ దర్శన సమయంలో మల్లికార్జున స్వామి వారికి అభిషేకం, భ్రమరాంబా దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మ వారి ఆలయం వద్ద సినీ హీరో శ్రీకాంత్ దంపతులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన అధికారులు స్వామి వారి శేషావస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. సినీ హీరో శ్రీకాంత్తో ఫొటోలు దిగేందుకు పలువురు భక్తులు ఆసక్తి చూపారు.
పత్తిలో మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు
ఎమ్మిగనూరుసెంట్రల్: పత్తి సాగులో మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని సీఐసీఆర్ ఫార్మర్ డైరెక్టర్ ప్రసాద్, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు శివనారాయణ, సహాయ పరిశోధన సంచాలకులు జాన్సన్, కెవీకె సమన్వయకర్త రాఘవేంద్రచౌదరి, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం బనవాసి కృషి విజ్ఞానకేంద్రంలో జిల్లాలో స్థిరమైన పత్తి ఉత్పత్తిపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుతున్న ధోరణులు, సరఫరా సమస్యలను అధిగమించాలంటే నాణ్యమైన పత్తి ఉత్పత్తి ద్వారానే సాధ్యమన్నారు. స్థిరమైన పత్తి ఉత్పత్తి కోసం అధిక సాంధ్రత పద్ధతి, సమగ్ర పోషక నిర్వహణ, దగ్గరగా విత్తుకునే పద్ధతి, సమగ్ర పురుగు నిర్వహణ వంటి సాంకేతిక పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు.
యువకుడి దుర్మరణం
గోనెగండ్ల: వేముగోడు గ్రామంలో జరిగిన ఓ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువులు అందించిన సమాచారం మేరకు.. వేముగోడు గ్రామానికి చెందిన రవి ప్రకాష్ రెడ్డి అనే రైతు తన పొలంలో బావి తవ్విస్తున్నాడు. పనులు చేపట్టిన క్రాంటాక్టర్ ఎక్స్క్టవేటర్తో బావి తవ్విస్తూ మట్టిని ట్రాక్టర్తో బయటకు తరలిస్తున్నాడు, సాధిక్ బాషా(16) అనే యువకుడు ట్రాక్టర్ పనికి వచ్చాడు. ట్రాక్టర్లో మట్టి వేసుకొని వెళ్తుండగా ఇంజన్, ట్రాలీకి మధ్య ఉన్న ఇనుప రాడ్ విరిగి పోవడంతో ట్రాలీ వేగంగా వచ్చి అక్కడే ఉన్న షాదిక్కు తగిలింది. దీంతో అతను తీవ్రగాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి మాబాషా ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు.


