కల్లూరు: శ్రీ చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు రెండో రోజు శుక్రవారం అంబరాన్ని అంటాయి. కల్లూరులోని అమ్మవారి ఆలయం వద్ద ఉదయాన్నే జ్యోతుల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మొక్కుబడులు ఉన్న రైతులు తమ ఎడ్లను రంగులతో, పూలమాలతో అలంకరించుకుని అమ్మవారి ఆలయం వద్దకు వచ్చారు. రజకులు తమ గాడిదల (గార్ధభాలను) బండ్లను పూలతో, రంగులతో అలంకరించుకుని డప్పులు, మేళాతాళాలు, డ్రమ్స్, డిజేలతో ఉత్సాహంగా కేరింతలు, నృత్యాలు వేస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన బురదలో అలంకరించిన ఎడ్లు, గాడిదలతో ప్రదక్షిణలు చేశారు. బురదలో చిన్నారులు, యువకులు ఒంటి నిండి బురద చేసుకుని ఉత్సహంగా వేడుకలో పాల్గొన్నారు. ఆలయం చుట్టూ ఉన్న బురదలో తిరగడం వల్ల చర్మవ్యాధుల నుంచి అమ్మవారు కాపాడతారని భక్తుల విశ్వాసం. ఎద్దులతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతుల నమ్మకం. సంబరాన్ని తిలకించేందుకు కర్నూలుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.


