కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ పనులు ప్రారంభించడానికి తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని అత్యంత శుభదినంగా అన్నదాతలు భావిస్తారు. దీంతో గురువారం ఉగాదిని పురస్కరించుకొని గ్రామసీమల్లో వ్యవసాయ పనుల సందడి నెలకొంది. పరాభవ నామ సంవత్సరం మొదటి రోజునే జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. గూడూరు, ఆదోని, దేవనకొండ, వెల్దుర్తి, పెద్దకడుబూరు, సి.బెళగల్, మంత్రాలయం తదితర మండలాల్లో ఉదయమే వృషభాలను నీటితో శుభ్రంగా కడిగి అలంకరించి పొలంలోకి తీసుకెళ్లి పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు చేపట్టారు. పరాభవ నామ సంవత్సరంలో కుటుంబంలో ఎవ్వరి పేరుతో బలం బాగుందో పంచాంగం ద్వారా తెలుసుకొని వారి ద్వారా వ్యవసాయ పనులు మొదలుపెట్టడం విశేషం. పరాభవ నామ సంవత్సరానికి గురువు రాజు అయినందున అన్ని శుభాలే ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


