● జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్
శ్రీశైలంటెంపుల్: మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ అన్నారు. బుధవారం శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్, పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో మహిళా జన్సున్వాయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా గృహహింస, బలవంతపు శ్రమ, వృద్ధ మహిళలపై దౌర్జన్యాలు వంటి అంశాలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టడం శుభపరిణామమన్నారు. మహిళా భద్రత, సంక్షేమ పథకాల సమర్థ అమలుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అంగన్వాడీ, ఆరోగ్య, విద్యా శాఖలు సమన్వయంతో బాలికల అరోగ్యం, పోషణపై దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ జిల్లాలో మహిళల భద్రత కోసం, రక్షణ కోసం తీసుకున్న చర్యలను వివరించారు. అనంతరం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


