● ప్రధాన కాల్వను వెంటాడుతున్న గండ్లు
● ఆందోళన చెందుతున్న రైతులు
బండిఆత్మకూరు: తెలుగుగంగ ప్రధాన కాల్వకు ఇటీవల తరచుగా గండ్లు పడటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. చిన్న దేవళాపురం, నారాయణాపురం, జీసీ పాలెం, లింగాపురం, రామాపురం గ్రామాల పరధిలో ప్రధాన కాలువ గట్టు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెల ఇరవై రోజుల వ్యవధిలోనే రెండు సార్లు గండి పడింది. ఆ సమయంలో కాల్వలో నీటి ప్రవాహం కేవలం రెండు వేల క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. వచ్చే ఖరీఫ్ సీజన్లో కాల్వకు అధిక క్యూసెక్కులు విడుదల చేయాల్సి వస్తోంది. దీంతో కాల్వ గట్టు సామర్థ్యంపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల శిథిలమైన కాల్వ గట్టును పటిష్ట పరచకపోతే గండ్లు పడే అవకాశం లేకపోలేదు. మరో వైపు కొందరు రైతులు తమ పొలాలకు నీళ్లు మళ్లించుకునేందుకు కాల్వ గండ్లు కొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రధాన కాలువ నిర్మాణంలో భాగంగా అండర్ టన్నెళ్లు, సూపర్ పాసేజ్ ప్రాంతాల్లో గండి కొట్టి సమీపంలోని చెరువులు, కుంటలు నింపుకుంటున్నారు. దీంతో ప్రధాన కాల్వ గట్టు దెబ్బతిని గండ్లు పడే అవకాశం ఉంది. భారీ గండ్లు పడితే పంట పొలాలను నీళ్లు ముంచెత్తే ప్రమాదం ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి అవసరమైన చోట తూములు ఏర్పాటు చేయడంతో పాటు గట్టును పటిష్ట పరచాలని రైతులు కోరుతున్నారు.


