824 మంది ఉల్లి రైతులకు అందని పరిహారం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 824 మంది ఉల్లి రైతులకు పరిహారం విడుదల కాలేదని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో 31,352 మంది ఉల్లి రైతులకు ఎకరాకు 20 వేల ప్రకారం విడుదల అయిందని తెలిపారు. ఇందులో 30,528 మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలకు జమ అయిందని తెలిపారు. 824 మంది రైతులకు మాత్రమే బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉండటం వల్ల జమ కాలేదని తెలిపారు. ఈ రైతుల వివరాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలకు పంపామని రైతులు చెక్ చేసుకొని బ్యాంకు ఖాతాలను యాక్టివ్ చేసుకోవడం, ఆధార్ లింక్ చేసుకోవడం చేసుకోవాలని సూచించారు.
క్యాష్బ్యాక్, నష్టపరిహారం చెల్లించాలి
కర్నూలు (అర్బన్): బైక్ కొనుగోలు సమయంలో ఇచ్చిన క్యాష్ బ్యాక్ ఆఫర్ను వినియోగదారుని ఖాతాలో జమ చేయకపోవడంపై ఓలా ఎలక్ట్రిక్ బైక్స్కు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మొట్టికాయ వేసింది. 2024 జులై 28న కల్లూరు మండలం పందిపాడు గ్రామానికి చెందిన వ్యక్తి రూ.1,32,212కు ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్ను కొనుగోలు చేశాడు. ఆసమయంలో రూ.10 వేలు క్యాష్ బ్యాక్ ఆఫర్ను పది రోజుల్లో జమ చేస్తామని హామీ ఇచ్చి చెల్లించలేదు. దీనిపై వినియోగదారుడు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కమిషన్ ఓలా ఎలక్ట్రికల్ బైక్స్కు పలుమార్లు లీగల్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడంతో కమిషన్ విచారణ జరిపి సేవల లోపం, అన్యాయ వ్యాపార విధానమని తేల్చింది. ఫిర్యాదుదారులకు రూ.10 వేల క్యాష్బ్యాక్ మొత్తాన్ని ఫిర్యాదు చేసిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో పాటు మానసిక వేదనకు రూ.10 వేలు నష్టపరిహారం, న్యాయ వ్యయాల కోసం రూ.5 వేలను 45 రోజుల్లోపు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఈ ఆదేశాలను కమిషన్ ప్రెసిడెంట్ కరణం కిషోర్ కుమార్, సభ్యులు ఎన్.నారాయణ రెడ్డి, ఎస్.నజీమా కౌసర్ జారీ చేశారు.
కర్నూలు(అర్బన్): ప్రజలకు మెరుగైన సేవలను వేగవంతంగా అందించేందుకే ప్రభుత్వం ఈ – గవర్నెన్స్ సిస్టమ్ను తీసుకొచ్చిందని డీపీఆర్సీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మంజులవాణి అన్నారు. మంగళవారం స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన జూనియర్ సహాయకులు, పరిపాలనాధికారులకు ఈ – గవర్నెన్స్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్ఐఆర్డీ అండ్ పీఆర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఒకే వేదిక నుంచే ఆన్లైన్ అప్లికేషన్లను అన్ని శాఖల సమన్వయంతో ఈ గవర్నెన్స్పై అవగాహన పెంచుకోవాలన్నారు. నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా క్షేత్ర స్థాయిలో ఉపాధి కూలీల హాజరును ఖచ్చితత్వంతో జీయోట్యాగ్తో నమోదు చేయవచ్చునన్నారు. శిక్షణా కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, సీనియర్ సహాయకులు వేణుగోపాల్, టీఓటీలు ఆస్రఫ్బాష, పి. జగన్నాథం, ఖలీలుల్లా, కె. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


