నేటి నుంచి ఈ – గవర్నెన్స్ అప్లికేషన్స్పై శిక్షణ
కర్నూలు(అర్బన్): గ్రామ స్వరాజ్య అభియాన్ – ఆర్జీఎస్ఏకి సంబంధించి ఈ నెల 6 నుంచి 9వ తేది వరకు ఈ – గవర్నెన్స్ అప్లికేషన్స్పై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ, డీపీఆర్సీ ప్రిన్సిపాల్ జి.నాసరరెడ్డి తెలిపారు. 6వ తేదిన స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ సహాయకులు, పరిపాలనాధికారులకు, 7వ తేదిన సీనియర్ సహాయకులు, డిప్యూటీ ఎంపీడీఓలకు శిక్షణా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అలాగే 8, 9వ తేదిల్లో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన అందరు పంచాయతీ కార్యదర్శులకు ఆయా డివిజన్ల హెడ్క్వార్టర్స్లోని మండల పరిషత్ సమావేశ భవనాల్లో శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ కొనసాగుతుందన్నారు. ఈ– గవర్నెన్స్ అప్లికేషన్స్లో నిష్ణాతులైన వారు శిక్షణ ఇస్తారన్నారు.
ఎఫ్ఏ–3 పరీక్షలు ప్రారంభం
కర్నూలు సిటీ: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఫార్మాటివ్ అసెస్మెంట్–3 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. అన్ని యాజమాన్యాలకు చెందిన 2,254 స్కూళ్లలో 2.56 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 90 శాతానికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు అయినట్లు సమాచారం. ఈ నెల 8వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ నెల 7వ తేదీ వరకు రోజుకొక పరీక్ష జరుగుతుంది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం, మద్యాహ్నం వేళల్లో పరీక్షలు జరుగుతున్నాయి.
పత్తి క్వింటా రూ.8,058
ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో పత్తి ధర రూ.8 వేలు దాటింది. సోమవారం యార్డుకు అమ్మకానికి 3426 క్వింటాళ్లు పత్తిని రైతులు తీసుకు వచ్చారు. క్వింటా గరిష్ట ధర రూ.8,058 పలికింది. మధ్యంతర ధర రూ.7776 లభించింది. కాగా సీసీఐ కేంద్రాల్లో క్వింటా పత్తిని రూ.8110 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
కర్నూలు: ఇన్ఫ్రా ప్రాజెక్టులో భూములు, రెవెన్యూ శాఖలో ఆరుగురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి సల్కాపురం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుశల్ రూ.52 లక్షలు తీసుకుని మోసం చేశాడని డీఐజీ, ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్కు కర్నూలు గీతా నగర్కు చెందిన మల్లికార్జున ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 84 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటినీ చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు విజయలక్ష్మి, కంబగిరి రాముడు తదితరులు పీజీఆర్ఎస్లో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు.
నేటి నుంచి ఈ – గవర్నెన్స్ అప్లికేషన్స్పై శిక్షణ


