‘సీమ’ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు!
● మంత్రి నిమ్మల డైవర్షన్ పాలిటిక్స్
చేస్తున్నారు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): రాయలసీమ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తాకట్టుపెట్టారని ప్రజలే చెబుతున్నారని, ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు మంత్రి నిమ్మల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నా రు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాలను మాజీ ఎంసీ వైఎస్ జగన్ అడ్డుకున్నారని మంత్రి నిమ్మల చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సీమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎందుకు నిలిపేశారన్నారు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రితో చంద్రబాబు చేసుకున్న లోపాయికారి ఒప్పందమే అని రాయలసీమ ప్రజల బహిరంగంగా చెబుతున్నారన్నారు.
ఓటుకు నోటు కేసుకు భయపడే...
టీడీపీ అధికారంలో ఉన్న 2015లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ప్రాజెక్టు సామర్థ్యం పెంచుకుంటున్నా చంద్రబాబు ఎందుకు అడ్డు చెప్పలేదని ఎస్వీ ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పాలమూరు రంగారెడ్డి, దిండి ఎత్తి పోతల పథకాలను చేపడుతుంటే అనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ఎందుకు పట్టించుకోలేదన్నారు. కేవలం ఓటుకు నోటు కేసులో భయపడే కదా అన్నారు. శ్రీశైలం ఎడమ గట్టు భూభాగాన్ని ఆక్రమించినా, నాగర్జున సాగర్ కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్ ఆక్రమించినా ఎందుకు కేంద్రం దృష్టికి తీసుకుపోలేదన్నారు. అపెక్స్ కౌన్సిల్లోను తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.
ఇదీ మా చిత్తశుద్ధి
రాష్ట్ర ప్రయోజనాలు, రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం 2016లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో జలదీక్ష చేశారని ఎస్వీ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. నాగర్జున స్పిల్వే గేట్లను 2023 డిసెంబర్లో స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలియడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించారన్నారు. హుటాహుటిన పోలీసులను పంపించి అడ్డుకోవడమే కాకుండా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఏపీ ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడరన్నారు. అది చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజల, రైతుల ప్రయోజనాలను చంద్రబాబు ఫణంగా పెడతానంటే పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని హెచ్చరించారు. అబద్ధాలు చెప్పి పబ్బం గడుపు కోవాలని చూస్తున్న కర్నూలు జిల్లా ఇన్చార్జీ మంత్రిగా ఉన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును సీమ ప్రాంత ప్రజలు, రైతులు అడ్డుకుంటారన్నారు.


