అనారోగ్యంతో వృద్ధుడి ఆత్మహత్య
బనగానపల్లె: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పలుకూరు గ్రామానికి చెందిన జే రామయ్య ఆచారి(70) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నందివర్గం ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాల మేరకు.. మూడు రోజులుగా రామయ్య ఆచారీ కనిపించకపోవడంతో కుటుంబీకులు గాలింపు మొదలు పెట్టారు. గ్రామ సమీపంలో శనివారం తెల్లవారు జామున వెంకటాపురం గ్రామ సమీపంలో ఎస్సార్బీసీ కాల్వలో మృతదేహాం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈయనకు భార్య సరోజమ్మ ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
కూరగాయలను రైతుబజారులో అమ్ముకోండి
కర్నూలు(అగ్రికల్చర్):కూరగాయలు పండిస్తున్న రైతు లు కర్నూలులోని సీ.క్యాంపు రైతుబజారులో గిట్టుబాటు ధరతో అమ్ముకోవాలని హార్టికల్చర్ కన్సల్టెంట్ శివకుమార్ తెలిపారు. శనివారం ఆయన కర్నూలు, కల్లూరు,బేతంచెర్ల మండలాల్లోని పడిదెంపాడు, రుద్ర వరం, చిన్నటేకూరు, పెద్దటేకూరు, ఎంబాయి,సీతారంపురం తదితర గ్రామాల్లో రైతులు సాగు చేసిన కూ రగాయల పంటలను పరిశీలించారు. రైతులు సాగు చేసిన టమాట, సొర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, గుమ్మడి కాయలు, ఆకు కూరలను పరిశీలించారు. కూరగాయలు సాగు చేసిన ప్రతి రైతుకు గుర్తింపు కార్డు ఇస్తామన్నారు. పండించిన కూరగాయలను రైతుబజారులో అమ్ముకోవాలని సూచించారు. రైతుబజారులో రైతులకు తగిన స్థానాలు కేటాయిస్తామన్నారు.
మెడికవర్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్లో శనివారం సాయంత్రం ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతి థిగా ఎస్ఎంటీబీసీ, కర్నూలు సీనియర్ పాస్టర్ డాక్టర్ కరుణ సాగర్ హాజరై క్రిస్మస్ సందేశమిచ్చారు. క్రిస్మస్ పండుగ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రేమ, శాంతి, సేవాభావం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని ఆయ న పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది నిర్వహించిన నృత్య కార్యక్రమాలు, గాన ప్రదర్శన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ పోటీల్లో ప్రతిభ కనపరచిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం క్రిస్మస్ ఆనందాన్ని ప్రతిబింబించేలా కేక్ కటింగ్ చేశారు. కార్యక్రమంలో న్యూరో సర్జన్ డాక్టర్ విశ్వకుమార్, రుమటాలజిస్ట్ డాక్టర్ సృజన, హాస్పిటల్ క్లస్టర్ హెడ్ వై.మహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో వృద్ధుడి ఆత్మహత్య


