రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు
కర్నూలు(సెంట్రల్): రహదారి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే స్పా ట్లను గుర్తించి నెల రోజుల్లో బారికేడింగ్, రంబుల్ స్ట్రిప్స్, సైన్బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
● పోలీసు శాఖ ప్రతిపాదించిన విధంగా ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్కు సంబంధించిన రోడ్లలో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.
● పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లలో బ్లైండ్ కర్వులు ఉన్న చోట రెండు, మూడు నెలలకోసారి బుష్ క్లియరెన్స్ చేపట్టాలన్నారు.
● జాతీయ రహదారుల్లో మీడియన్స్ నిర్వహణ సరిగా లేదని, సక్రమంగా నిర్వహించాలని నేషనల్ హై అధికారులను ఆదేశించారు.
● ఎల్లమ్మ దేవాలయం వద్ద జరుగుతున్న అప్రోచ్ రోడ్డు పనులను డిసెంబర్ 10 నాటికి పూర్తి చేసి స్వాధీనం చేయాలన్నారు.
● పెద్దపాడు నుంచి ఎన్హెచ్కు లింకు చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను రివైజ్ చేసి మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తీసుకొని ప్రభుత్వానికి పంపాలని కమిషనర్ పి.విశ్వనాథ్ను ఆదేశించారు.
● ఆటోల్లో వెనుకవైపు ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలని డీటీసీ శాంతకుమారిని ఆదేశించారు.
● కిడ్స్ వరల్డ్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
● ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్లో కాపాడిన వారికి గుడ్ సమరిటన్గా అభినందిస్తూ రూ.25 వేల వరకు ప్రభుత్వ ఆర్థిక సాయం చేస్తుందని, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, పీఆర్ ఎస్ఈ వేణగోపాల్, ఆర్టీసీ ఆర్ఎం ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు.


