వైభవోపేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో స్వాతి మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను దేవాలయం ఎదురుగా యాగశాలలో కొలువుంచారు. అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరణచేసి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం పండితుల మంత్రోచ్ఛారణలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య స్వాతి, సుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పుష్పాలంకరణ చేసిన ఉత్సవ పల్లకీలో రాత్రి ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.
వైభవోపేతం.. స్వాతి మహోత్సవం


