
ఆదాయం వద్దు.. ప్రయివేట్ ముద్దు
వైఎస్సార్సీపీ హయాంలో రూ.14.75 కోట్లతో అభివృద్ధి
98 శాతం ఆక్యుపెన్సీతో నెలకు రూ.57 లక్షల ఆదాయం
అయినా ప్రైవేట్పరం చేసేందుకు ప్రభుత్వం అడుగులు
శ్రీశైలం టెంపుల్: పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) యూనిట్లను కూటమి ప్రభుత్వం ప్రయివేట్కు అప్పగించేందుకు అడుగులు వేస్తోంది. ప్రసిద్ధ శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఉన్న ఏపీ టూరిజంకు చెందిన హరిత రిసార్ట్ను ఇలానే వ్యక్తులకు కట్టబెట్టనుంది. 2002లో దాదాపు రూ.కోటితో 32 రూములతో ఈ రిసార్ట్ ప్రారంభమైంది. అంచలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. గత వైఎసార్సీపీ ప్రభుత్వం టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ చూపి మరింత మెరుగుపరిచింది. ప్రస్తుతం 124 రూములతో భక్తులకు సేవలందిస్తోంది. 98 శాతం ఆక్యుపెన్సీతో టూరిజం శాఖకు నెలకు రూ.57 లక్షల ఆదాయం ఒక్క హరిత రిసార్ట్ నుంచే వస్తోంది. అయినా, ప్రైవేట్కు ఇచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో టూరిజం ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.
●శ్రీశైల దేవస్థానానికి చెందిన ఎకరం భూమిలో ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత రిసార్ట్ ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశం, లక్ష్యంతో నామమాత్ర రుసుము, భూమి అద్దెతో ఈ భూమిని 23 ఏళ్ల క్రితం టూరిజం శాఖకు కేటాయించారు. 2002లో రూ.కోటితో 32 వసతి గదులు, హోటల్ నిర్మించారు. సామాన్య భక్తులకు సైతం వసతి గదులు అందుబాటులో ఉండేలా హరిత రిసార్ట్ ఏర్పాటు చేశారు. ఆదరణ బాగుండడంతో 2009లో మరో 44 గదులను నిర్మించారు.
● హరిత రిసార్ట్ను మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు మెరుగైన సేవలు అందించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రూ.14.97 కోట్లతో టెండర్లను పిలిచి 2024 మార్చిలో పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేశారు. ప్రస్తుతం శ్రీశైలం హరిత రిసార్ట్లో పాత, కొత్త భవనాల్లో 124 వసతి గదులు ఉన్నాయి.
● వీటిలో 12 నాన్ ఏసీ గదులు (రోజుకు రూ.1,232), 44 ఏసీ గదులు (రోజుకు రూ.1,904), 24 డీలక్స్ గదులు (రోజుకు రూ.2,128), ఇవికాక 8 ఎగ్జిక్యూటివ్ గదులు (రోజుకు రూ.2,688) ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మించిన 36 గదులు, కొత్త హంగులతో నిర్మించిన రెస్టారెంట్ ఇంకా ప్రారంభించాల్సి ఉంది.
● శ్రీశైలం హరిత రెస్టారెంట్ పర్యటకుల మన్ననలు పొందుతోంది. 2022లో నెలకు రూ.32 లక్షలున్న ఆదాయం అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టడంతో మరింత పెరిగింది. కేవలం ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న హరిత రిసార్ట్ 98 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. రిసార్ట్ నుంచి నెలకు రూ.57 లక్షల ఆదాయం టూరిజం శాఖకు లభిస్తోంది.
● రిసార్ట్లో 23 ఏళ్ల నుంచి వివిధ కేటగిరీల్లో 45 మంది విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 26, ఔట్సోర్సింగ్లో 9, సెక్యూరిటీలో ముగ్గురు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తానని ప్రకటించడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు.
శ్రీశైలం హరిత రిసార్ట్ ముఖ ద్వారం
శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్న హరిత రిసార్ట్ను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే పవిత్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ధరలు అందుబాటులో ఉండకపోగా, వసతి గదుల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం హరిత రిసార్ట్ స్థలం దేవస్థానానికి చెందినది. ప్రభుత్వం ప్రైవేట్కు అప్పగించాలనే ఉద్దేశంలోనే ఉంటే.. హరిత రిసార్ట్ను దేవస్థానమే నిర్వహించేలా చూడాలని భక్తులు కొరుతున్నారు.
శ్రీశైల దేవస్థానం ఎకరం భూమిలో హరిత రిసార్ట్ ఏర్పాటు
ప్రైవేట్కు అప్పగిస్తే
క్షేత్ర పవిత్రతకు ముప్పు!

ఆదాయం వద్దు.. ప్రయివేట్ ముద్దు

ఆదాయం వద్దు.. ప్రయివేట్ ముద్దు