
జిల్లాలో హాస్టళ్ల వివరాలు
శిథిలావస్థలో ఉన్న ఆలూరు ఎస్సీ బాలికల హాస్టల్ వంట గది
లద్దగిరి బీసీ హాస్టల్లో పెట్టెల మధ్య నిద్రిస్తున్న విద్యార్థులు
కోడుమూరు మండలం అమడగుంట్ల బీసీ బాలుర హాస్టల్ను కూడా ‘సాక్షి’ బృందం పరిశీలించింది. పొలాలను అనుకొని ఉన్న ఈ హాస్టల్కు కనీసం కాంపౌండ్ వాల్ కూడా లేదు. క్రిమి కీటకాలు, పాములు, తేళ్లు సంచరించే ప్రమాదం పొంచి ఉంది. ఈ హాస్టల్లో 107 మంది విద్యార్థులకు 10 స్నానపు గదులు, 10 టాయ్లెట్లు ఉండగా వాటికి నీటి సౌకర్యం లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. విద్యార్థులందరూ మల మూత్రాలను విసర్జించేందుకు పక్కనే పొలాల్లోకి వెళ్తున్నారు. రాత్రి సమయంలో హాస్టల్ పరిసరాల్లో చిమ్మచీకటిగా ఉంది. విద్యార్థులు భోజనం చేసే స్థలం అంతా బండపరుపు లేక వర్షంతో బురదమయంగా మారింది.
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు అధ్వానంగా మరాయి. మెనూ సంగతి దేవుడెరుగు, కనీసం మౌలిక వసతులను కూడా కల్పించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందుల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. నీటి సౌకర్యం లేక వసతి గృహాల్లో స్నానపు, మరుగుదొడ్ల గదులు, అలంకార ప్రాయంగా మారాయి. అనేక చోట్ల ఫ్యాన్లు పనిచేయడం లేదు. ప్రహరీలు లేకపోవడంతో విద్యార్థులు భోజనాలు చేసే ప్రాంతంలో కుక్కలు, పందులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. పలు వసతి గృహాల్లో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాల్లోనే చిన్నారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వసతులు పొందుతున్నారు.
అటకెక్కిన నిధులు!
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సోషల్ రెస్పెన్సిబులిటీ కింద జిల్లాలోని 24 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అనేక రకాల పనులను చేపట్టింది. ఈ పనులను పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఎస్డబ్ల్యూఐడీసీ శాఖలకు అప్పగించింది. ఒక్కో శాఖ ఆధ్వర్యంలో 8 హాస్టళ్లలో పనులు ప్రారంభించారు. అయితే ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు దాదాపు 80 శాతం వరకు పూర్తి అయినా, నేటికి నయాపైసా నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా పనులను నిలిపివేసినట్లు, మరి కొన్ని హాస్టళ్లలో పనుల్లో జాప్యం నెలకొన్నట్లు తెలుస్తోంది.
పర్యవేక్షణ కరువు
జిల్లాలోని ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లో పర్యవేక్షణ కరువైంది. ముఖ్యంగా వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నందున ఒక్కో వసతి గృహ సంక్షేమాధికారి వన్ ప్లస్ వన్ ఆఫర్లా ఇన్చార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసినట్లు తెలుస్తోంది. ఈ శాఖకు సంబంధించి మొత్తం ( ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్ కలిపి ) 47 వసతి గృహాలు ఉండగా, 18 వసతి గృహాలు ఇన్చార్జ్ హెచ్డబ్ల్యూల పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి.
బాలిక వసతి గృహాల్లో అసౌకర్యాలు
జిల్లాలోని అనేక బాలికల వసతి గృహాల్లోను సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కలెక్టరేట్కు సమీపంలోని ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాల సముదాయంలో కనీసం విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా స్నానపు గదులు, మరుగుదొడ్లు లేవు. బాలికలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ మూడు వసతి గృహాల్లో మొత్తం 500 మందికి పైగా విద్యార్థినులు వసతి పొందుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన రెండు వసతి గృహాల్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నా, బీసీ బాలికల వసతి గృహానికి మినరల్ వాటర్ ప్లాంట్ లేదు. పైగా ఈ వసతి గృహంలో టాయ్లెట్ల సమస్య అధికంగా ఉంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం కూడా ఎక్కడికక్కడ పెచ్చులూడి పడుతోంది.
డైట్ చార్జీలను పెంచిన
మాజీ సీఎం వైఎస్ జగన్
పెరిగిన నిత్యావసర సరుకులకు ధరలకు అనుగుణంగా సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల డైట్ చార్జీల పెంపుపై కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వసతి గృహ సంక్షేమాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్న సమయంలో జీఓ నంబర్: 8, తేదీ 20/02/2023 మేరకు డైట్ చార్జీలను పెంచారని వారు గుర్తు చేస్తున్నారు. 3, 4 తరగతుల విద్యార్థులకు గతంలో నెలకు రూ.1000 ఉండగా, వైఎస్ జగన్ ఈ మొత్తాన్ని రూ.1,150కి పెంచారని, 5 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రూ.1,250 నుంచి రూ.1,400లకు పెంచారని, అలాగే ఇంటర్మీడియట్ ఆపై తరగతుల వారికి రూ.1,400 నుంచి రూ.1,600లకు పెంచారిన చెబుతున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచకుండా పాత రేట్ల ప్రకారమే మెనూను అమలు చేయాలని చెప్పడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామంటున్నారు.
శాఖ మొత్తం హాస్టళ్లు విద్యార్థుల
(ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్) సంఖ్య
బీసీ సంక్షేమం 47 8063
సాంఘిక సంక్షేమం 37 7214
గిరిజన సంక్షేమం 07 2174
(ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు)

జిల్లాలో హాస్టళ్ల వివరాలు

జిల్లాలో హాస్టళ్ల వివరాలు

జిల్లాలో హాస్టళ్ల వివరాలు