
నకిలీ ఆర్సీల తయారీ ముఠా గుట్టురట్టు
కర్నూలు: ఎలక్ట్రానిక్ పరికరాలతో వాహన నకిలీ రికార్డులు, పోలీసు ఎన్ఓసీలు, నకిలీ ట్రేడ్ ఐటీఐ సర్టిఫికెట్లు తయారీ చేసి విక్రయించే ముఠా గుట్టు రట్టయ్యింది. నంద్యాల పట్టణానికి చెందిన షేక్ సుభాన్, షేక్ షాకీర్, నంద్యాల ఆర్టీఓ ఆఫీసులో ఏజెంటుగా పనిచేస్తున్న సుధీర్ బాబు, కర్నూలు పాతబస్తీలోని ఖండేరి వీధిలో ఉన్న ఐటీఐ ఉద్యోగి పెనుగొండ సూరప్ప ముఠాగా ఏర్పడి నకిలీ ఆర్సీలు, పోలీస్ ఎన్ఓసీలు, ఐటీఐ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఈనెల 14న అంతర్రాష్ట్ర బైక్ దొంగలను మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది మే 22వ తేదీన కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఓ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూన్ 18న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా దొంగల చిట్టా బయటపడటమే కాక తీగ లాగితే డొంక కదిలిన చందంగా చోరీకి గురైన బైకులకు నకిలీ ఆర్సీలు తయారు చేసిన ముఠా వివరాలు కూడా బయటపడ్డాయి. ప్రభుత్వాసుపత్రిలో చోరీకి గురైన వాహనానికి సంబంధించిన ఆర్సీ కూడా నకిలీదిగా గుర్తించడంతో పాటు తయారీదారులను పోలీసులు గుర్తించి పక్కా ఆధారాలతో నంద్యాల చెక్పోస్టు సమీపంలోని మధులోక్ బార్ రెస్టారెంట్ దగ్గర నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి నేరాల చిట్టా బయటపడింది. సోమవారం సాయంత్రం మూడో పట్టణ సీఐ శేషయ్యతో కలసి కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ స్థానిక స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. షేక్ సుభాన్, షేక్ షాకీర్, సుధీర్ బాబు, ఐటీఐ ఉద్యోగి పెనుగొండ సూరప్ప కలసి ముఠాగా ఏర్పడి జిల్లాలోనే కాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఆర్టీఓ బ్రోకర్ల ద్వారా నకిలీ ఆర్సీలు తయారు చేసి విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యిందని డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద భారీగా నకిలీ ఆర్సీలతో పాటు పోలీస్ ఎన్ఓసీ సర్టిఫికెట్లు, ఐటీఐ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుని రెండు కార్లు కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.
రెండు కార్లు, భారీగా నకిలీ ఆర్సీలు, పోలీస్ ఎన్ఓసీలు స్వాధీనం