
రుద్రభూమిలో ఉద్రిక్తత
● చెట్నెహళ్లిలో శ్మశాన కంచె ఏర్పాటుపై తీవ్ర నిరసన ● కంచెకు వ్యతిరేకంగా భీష్మించిన హిందూ వర్గీయులు ● ఇరువర్గాలతో జేసీ చర్చలు విఫలం ● గ్రామంలో ఉద్రికత.. భారీ బందోబస్తు
మంత్రాలయం/మంత్రాలయం రూరల్: తరతరాల రుద్రభూమి కోసం ఊరు ఏకమైంది. కంచె ఏర్పాటుపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శాంతియుతంగా మొదలైన తిరుగుబాటు సాయంత్రానికి ఒకానొక దశలో ఉద్రిక్తతకు దారి తీసింది. హుటాహుటినా జేసీ సంఘటన స్థలానికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. హిందువుల తిరుగుబాటుతో అధికారులు నిశ్చేష్టులయ్యారు. మంత్రాలయం మండలం చెట్నెహళ్లి గ్రామంలో శ్మశాన వాటిక విషయంలో ఓ సామాజిక వర్గం, హిందూ వర్గాల మధ్య కొన్ని నెలలుగా విభేదాలు తలెత్తాయి. తమ ఇళ్లను ఆనుకుని ఉన్న శ్మశాన వాటికలో హిందువుల ఖననాన్ని ఖండిస్తూ సామాజిక వర్గీయులు పలుమార్లు ఆందోళనలకు దిగారు. ఇటీవల ఓ రైతు మృతదేహం ఖననం విషయంలో సామాజిక వర్గీయులు అడ్డుపడటం జరిగింది. అప్పటి నుంచి శ్మశాన వివాదం ముదిరిపోయింది. తరాలుగా వస్తున్న శ్మశానాన్ని వదులుకోమంటూ హిందువులు భీష్మించారు. మూడు రోజుల క్రితం కలెక్టరేట్ ఎదుట కూడా నిరసనకు దిగారు. దీంతో శ్మశాన స్థల వివాదాన్ని సద్దుమణిచేందుకు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ రంగంలోకి దిగారు. శుక్రవారం ఇరు వర్గాలతో మంత్రాలయం రెవెన్యూ కార్యాలయంలో సమావేశమయ్యారు. సమీక్షలో ఇరువర్గాల అభిప్రాయం మేరకు శనివారం కంచె ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు పోలీసు బలగాలతో వచ్చారు.
కంచె ఏర్పాటు అడ్డగింత..
గ్రామంలోని సర్వే నంబర్ 113లో 3.83 ఎకరాలు, సర్వే నం.114బీలో 1.02 ఎకరాల్లో ప్రభుత్వం రస్తా పొరంబోకు భూమి ఉంది. అందులో 113లోని దాదాపు ఎకరా భూమిలో ఓ సామాజిక వర్గీయులు ఇళ్లను నిర్మించుకున్నారు. ఇంకొంత భూమిలో గురుబోధకుల సమాధులు ఉండగా.. 0.47 సెంట్ల స్థలం రస్తా పొరంపోగు మిగిలింది. ఈ భూమికి కంచె ఏర్పాటు చేసేందుకు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నేతృత్వంలో పూనుకున్నారు. సామాజిక వర్గీయుల ఇళ్ల వైపు 20 అడుగులు వదిలి కంచెను వేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి 56 అడుగుల వెడల్పుతో కంచె వేయాలని ముందుగా కొలతలు వేసి పిల్లర్లు పాతేందుకు మార్కు వేశారు. ఒప్పందం ప్రకారం కంచె వేయడం లేదంటూ ఒక్కసారిగా హిందూ మహిళలు శ్మశాన వాటికలోకి దూసుకువచ్చారు. అంతవరకు దూరంగా ఉన్న మహిళలు దూసుకురావడంతో కంచె నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. ఇలాగైతే కంచెను వేయనీయమంటూ శ్మశానంలో పనులు నిలిపేసి బైఠాయించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు అలాగే కూర్చుని శాంతియుతంగా ఆందోళనకు దిగారు.
సర్దుబాటుకు ససేమిరా..
కంచె ఏర్పాటుకు హిందువులు అడ్డుపడగా సబ్ కలెక్టర్ జోక్యంతో 40 అడుగుల వెడల్పుకు కుదించారు. ఎంతకీ ఒప్పుకోకపోవడంతో సమస్య జఠిలంగా మారడంతో జాయింట్ కలెక్టర్ నవ్య గ్రామానికి చేరుకున్నారు. హిందువుల కోరిక మేరకు 30 అడుగుల వెడల్పుతో కంచె వేసేందుకు సర్దుబాటు చేశారు. అందుకు ఓ సామాజిక వర్గీయులు ససేమిరా అనడంతో వేరే మార్గం లేక జేసీ వెనుదిరిగారు. అంతకు ముందు జేసీ మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐక్యంగా ఉండాలని, పంతాలకు వెళ్లరాదని సూచించారు. రాజీమార్గంలో శ్మశాన వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నారు. ప్రస్తుతం కలెక్టర్ నిర్ణయం మేరకు కంచె ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అయితే ‘మీకు మొక్కుతాం.. అమ్మా’ మాకు న్యాయం చేయండి అంటూ హిందూ మహిళలంతా జేసీని వేడుకున్నారు. చివరగా ఇరువర్గాలతో సమావేశమైనా ఫలితం లేకపోయింది. శ్మశాన విషయంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా ప్రవర్తించినా ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయాలంటూ జేసీ స్థానిక సీఐ రామాంజులుకు ఆదేశించి వెనుదిరిగారు. ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా డీఎస్పీ ఉపేంద్రబాబు నేతృత్వంలో ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 150 పోలీసుల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

రుద్రభూమిలో ఉద్రిక్తత