
సుప్రీం తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంప పెట్టు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేసినట్లు సుప్రీం కోర్టు తీర్పుతో తేలిపోయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు రాష్ట్రంలో గాడితప్పిన పాలనకు హెచ్చరిక లాంటివన్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరెస్టులు ఆక్రమమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం హర్షణీయమన్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా 70 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు అరెస్టులో అత్యంత అమాననీయంగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు భద్రత కరువైందని, ఇందుకు ప్రతి రోజూ పత్రికల్లో, టీవీ చానళ్లలో వస్తున్న వార్తలే నిదర్శనమన్నారు. నేరం చేశారని ముగ్గురు యువకులను రోడ్డు మీద హింసించారని, అత్యాచారం చేసిన మృగాలను ఈ విధంగానే ఎందుకు శిక్షంచడం లేదన్నారు. రాష్ట్రంలో అకృత్యాలు చేయాలని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఏమైనా లైసెన్సు ఇచ్చారా అని ప్రశ్నించారు.
హర్షణీయం
కర్నూలు(సెంట్రల్): సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసులుకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించడం హర్షణీయమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, కేబీ శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ నాగేంద్ర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కొమ్మినేని కేసు విషయంలో విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలమన్నారు. సుప్రీం కోర్టు తీర్పును ఏపీడబ్ల్యూజేఎఫ్ స్వాగతిస్తుందన్నారు. ఇప్పటికై నా పోలీసులు జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు.