
వైద్యసేవ అమలులో జీజీహెచ్కు మొదటి స్థానం
కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద మే నెలలో 3,353 మంది రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించిన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం ఆసుపత్రిలోని ధన్వంతరి హాలులో వివిధ విభాగాల హెచ్ఓడీలు, ప్రొఫెసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద సేవలు అందించినందుకు అన్ని విభాగాధిపతులకు అభినందనలు తెలిపారు. ఈ–హాస్పిటల్ అమలు చేయడానికి పూర్తిస్తాయిలో సమీక్షించారు. రెగ్యులర్గా ప్రతి విభాగ ఓపీ, ఐపీ, డిశ్చార్జ్ వివరాలను ఈ–హాస్పిటల్లో అప్లోడ్ చేయడానికి హౌస్సర్జన్లు, పీజీలు, నర్సింగ్ సిబ్బంది సేవలు వినియోగించుకునేలా చూసుకోవాలన్నారు. ప్రతిరోజూ ఈ–హాస్పిటల్ అమలు, పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్యసేవలు ప్రజలకు చేరువ చేయాలని, ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్లోని ఆరు అంశాలపై కాల్స్, వాట్సాప్, క్యూ ఆర్ కోడ్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందని, ఇందుకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని హెచ్వోడీలకు సూచించారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ సేవలను మరింత పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పారిశుధ్య సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. ఓపీ విభాగాల్లో సమయపాలన పాటించాలని, లేకపోతే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వైద్యులకు హెచ్చరించారు. సమావేశంలో సీఎస్ఆర్ఎంవో డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, హెచ్వోడీలు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ హరిచరణ్, డాక్టర్ విజయానందబాబు, డాక్టర్ రాధారాణి, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ మాధవి శ్యామల, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ కిరణ్కుమార్ పాల్గొన్నారు.