
నిర్లక్ష్యం గడ్డ కట్టి.. సమస్య వెక్కిరించి!
జూపాడుబంగ్లా: గత వైఎస్సార్సీపీ పాలనలో విద్యావ్యవస్థకు పెద్ద పీటవేసి నాడు–నేడు పథకం కింద గ్రామాల్లోని పాఠశాలలను కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాడు–నేడు రెండో విడత కింద చేపట్టిన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయకపోవటంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తంగడంచ ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు నాడు–నేడు రెండోవిడత కింద రూ.12 లక్షలతో టాయ్లెట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు గత ప్రభుత్వం రూ.3 లక్షల నిధులతో పాటు తలుపులు, విద్యుత్ సామగ్రి, లెట్రిన్బేషిన్లు, సిమెంట్ మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగతా నిధుల మంజూరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. పనుల కోసం తెచ్చిఉంచిన 40 సంచుల సిమెంటు బస్తాలు గడ్డకట్టిపోయాయి. ఈ విషయమై పాఠశాల హెచ్ఎం జాకీర్ను వివరణ కోరగా రూ.12 లక్షలతో పాఠశాలకు టాయ్లెట్లు మంజూరయ్యాయి. రూ.3లక్షల నిధులు మంజూరు కాగా పనులు ప్రారంభించాం. ప్రభుత్వం మారిన తర్వాత నిధులు మంజూరు కాకపోవటంతో పనులు నిలిచిపోయాయి. నిధులు మంజూరైతే మళ్లీ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.