
క‘రుణ’లేక.. కష్టాలు తొలగక!
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘పదవులు స్థిరమని భ్రమించే వాళ్లు.. ఓట్లు గుంజి నిను మరిచే వాళ్లు.. నీవే దిక్కని అబద్ధాలు చెప్పే వారు.. హామీలు ఇచ్చి అమలు చేయని వారు.. రోజులు మారాయ్..’’ అనే పాటను రైతులు పాడుకుంటున్నారు. ఏరువాక పౌర్ణమి రైతులకు పెద్ద పండుగ. ఎద్దులకు పరుగుపందేలు నిర్వహించి గెలిచిన వృషభాలకు ఆహారంగా ధాన్యం పెట్టి.. అవి తినగా మిగిలిన వాటిని రైతులు తీసుకెళ్లి విత్తనాల్లో కలుపుకుంటారు. ఇలా చేస్తే పంట బాగా వస్తుందనే నమ్మకం రైతుల్లో ఉంది.
రైతులను మరచిపోయిన రాష్ట్ర ప్రభుత్వం
స్వేదాన్ని చిందిస్తూ సేద్యానికి ఊపిరి పోసే రైతులను రాష్ట్ర ప్రభుత్వం మరచిపోయింది. పుడమితల్లికి సౌభాగ్యాన్ని అందించే అన్నదాతల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికీ ఏరువాక ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. పంటల సాగుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం దక్కలేదు. పెట్టుబడులకు కనీసం బ్యాంకులు రుణాలు ఇవ్వని దుస్థితి నెలకొంది. దీంతో రైతుల్లో అసంతృప్తి, నిరుత్సాహం, నిరాశ అలుముకున్నాయి. వ్యవసాయంపై ఉత్సాహం కొరవడింది.
విత్తు..విపత్తు
ఖరీఫ్లో ప్రధానంగా పత్తి 2.34 లక్షల హెక్టార్లలో సాగు కానుంది. అయితే పత్తి విత్తనాల్లో నకిలీలు వెల్లువెత్తుతున్నాయి. లూజు పత్తి విత్తనాలు జోరుగా విక్రయిస్తున్నారు. వేరుశనగ విత్తన కాయల పంపిణీ మొదలైనప్పటికీ రైతులకు అరకొర ఇస్తున్నారు. వేరుశనగ విత్తన కాయల్లో మట్టి, రాళ్లు ఎక్కువగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. రైతులకు పచ్చి రొట్ట ఎరువుల ఇవ్వడం మరచిపోయారు.
అన్నదాత సుఖీభవ ఏదీ...
2024 ఎన్నికల సమయంలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్–6లో ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 2024–25 సంవత్సరం ముగిసిపోయింది. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయాన్ని ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ పంట రుణాల జాడ లేకుండా పోయింది.
వైఎస్సార్సీపీ
హయాంలో ఇలా..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు అన్నదాతలకు అన్ని విధాలుగా సాయం అందించింది. ప్రతి ఏటా మే నెల 15 నుంచే విత్తనాల పంపిణీ జరిగేది. ఖరీప్ సీజన్ మొదలవుతుందంటే వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందేది. అలాగే ఉచిత పంటల బీమా కింద పరిహారం పంపిణీ చేసేవారు. ప్రతి ఏటా మృగశిర కార్తె వచ్చే పౌర్ణమి రోజున ‘ఏరువాక’ వేడుకలు ఘనంగా నిర్వహించేవారు.
ఏరువాక పండుగ రోజూ
రైతులకు అవే అవస్థలు
స్పందించని రాష్ట్ర ప్రభుత్వం