
ఇంకెన్నాళ్లు..రేకుల కంపార్ట్మెంట్లు!
ఉక్కపోతతో అల్లాడుతున్నాం
శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం 50మందితో బృందంగా వచ్చాం. ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా దర్శనానికి వెళ్లాం. కంపార్ట్మెంట్లలో ఫ్యాన్లు ఉన్నప్పటికీ అందరికీ సరిపడా గాలి రావడం లేదు. ఉక్కపోతతో అల్లాడిపోయాం. సాధారణ రోజుల్లోనే దర్శనానికి రెండు గంటలు పట్టింది. రద్దీ రోజుల్లో వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో. కంపార్ట్మెంట్లలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
– బాలాజీ, గురువాయర్, కేరళ
నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మించాలి
శ్రీశైలం దేవస్థానంలో వెలసిన శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వార్ల దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. మా తల్లిదండ్రులతో పాటు మేము శ్రీశైలానికి ప్రతి ఏటా వస్తున్నాం. గతంతో పొలిస్తే కొన్ని సౌకర్యాలు మెరుగుపడ్డాయి. కొన్నేళ్ళ నుంచి ఇవే కంపార్ట్మెంట్లు, ఇవి మాత్రం మెరుగుపడటం లేదు. భక్తులకు అన్ని సౌకర్యాలతో కూడిన నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుంది. దేవదాయశాఖ ఆ దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది.
– కార్తికేయ, హైదరాబాద్
శ్రీశైలంటెంపుల్: మనస్సు ప్రశాంత, అధ్యాత్మిక చింతనను పెంపొందించుకునేందుకు పలువురు భక్తులు శ్రీశైల యాత్రకు తరలివస్తారు. మల్లన్న దర్శనానికి వెళ్లాలంటే గంటల తరబడి నరకయాతన పడాల్సిందే. శ్రీశైల దేవస్థానంలో రేకుల షెడ్డులో క్యూ కంపార్ట్మెంట్లు ఉండడంతో ఎండలకు, వానలకు భక్తులు అవస్థలు పడుతున్నారు. తక్కువ మంది భక్తులు పట్టే సామర్థ్యం కలిగిన కంపార్ట్మెంట్లు ఉండడం, భక్తులను దర్శనానికి గంటల తరబడి కంపార్ట్మెంట్లలో వేచిఉంచడంతో ఉక్కపోతతో చంటిపిల్లలు, వృద్ధులు, మహిళల అవస్థలు ఆ పరమేశ్వరుడుకే ఎరుక అన్నట్లుగా మారింది.మంగళవారం నుంచి శుక్రవారం వరకు 10వేల నుంచి 15వేల మంది భక్తులు, శని,ఆది, సోమవారా ల్లో 15వేల నుంచి 20వేల మంది భక్తులు ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటారు. ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో, ఉగాది ఉత్సవాల్లో రోజుకు లక్ష మంది, కార్తీకమాసం, ఇతర ముఖ్యమైన పర్వదినాల్లో 50వేలకు పైగా భక్తులు ఉచిత క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనానికి వెళ్తారు. రద్దీ నేపథ్యంలో తోపులాటల జరగకుండా దేవస్థానం క్యూ కంపార్ట్మెంట్లను అందుబాటులోకి తెచ్చింది. 17 కంపార్ట్మెంట్లలో మొత్తం 10,100 మంది ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా దర్శించుకునే అవకాశం ఉంది. అలాగే శీఘ్ర(రూ.150), అతిశీఘ్ర(రూ.300) క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనానికి వెళ్లేందుకు ఎనిమిది కంపార్ట్మెంట్లలో 3, 360 మంది భక్తులు,క్యూలైన్ (స్టాండింగ్) 5,300 మంది భక్తులు,వృద్ధులు, దివ్యాంగుల కోసం 1200 వేచి ఉండే నాలుగు క్యూలైన్లు,ఆలయంలో లోపల 1700 మంది వేచిఉండేలా నాలుగు ప్రత్యేక క్యూలైన్లు మా త్ర మే ఉన్నాయి.మొత్తంగా 25 కంపార్ట్మెంట్లలో 15,500 మంది భక్తులు వేచిఉండే అవకాశం మాత్రమే ఉంది.
నిలిచిన టెండర్..
శ్రీశైల దేవస్థానంలో ఉన్న రేకులషెడ్డు క్యూ కంపార్ట్మెంట్లలో భక్తులు పడుతున్న కష్టాలను చూసిన అప్పటి శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.75 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నూతన క్యూకాంప్లెక్స్ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అటు తరువాత క్యూ కాంప్లెక్స్కు టెండర్లు సైతం పిలిచారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలు రావడంతో టెండర్ల ప్రక్రియ అర్దాంతరంగా అగిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా నూతన క్యూ కాంప్లెక్స్పై ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పాత రేకుల షెడ్డుల కంపార్ట్మెంట్లలో భక్తులు అవస్థలు పడుతున్నా ఇటు దేవదాయశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు.
భక్తుల కష్టాలు పరమేశ్వరుడికెరుక..
క్యూ కాంప్లెక్స్లలో భక్తుల కష్టాలు
రేకుల కంపార్ట్మెంట్లలో ఉక్కపోత
గత ప్రభుత్వంలో రూ.75 కోట్లతో
నూతన క్యూ కాంప్లెక్స్కు శంకుస్థాపన
ఏడాదైనా పట్టించుకోని కూటమి
ప్రభుత్వం
ప్రతిపాదనలను సవరించి పంపాం
నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణంపై గతంలో ప్రతిపాదించిన ప్రతిపాదనలను సవరించి పంపించాం. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా రూ.79 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణం ఏ ప్రదేశంలో చేపడతామో తగు ప్రతిపాదనలను రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్, చీఫ్ ఇంజినీర్ అనుమతి కోసం పంపాం. అనుమతులు రాగానే టెండర్ ప్రక్రియ పూర్తిచేస్తాం. త్వరలోనే క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపడతాం.
– శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన
కార్యనిర్వహణాధికారి
శ్రీశైల దేవస్థానంలో ఉన్న 25క్యూ కంపార్ట్మెంట్లు రేకులషెడ్డులే కావడంతో భక్తులు ఆయా కంపార్ట్మెంట్లలో ఎండపోతకు, వానలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. క్యూ కంపార్ట్మెంట్లలో ఫ్యాన్లు ఉన్నప్పటికీ వందలాది మంది భక్తులకు కంపార్ట్మెంట్లలోకి అనుమతించడంతో ఫ్యాన్ల గాలి సరిపడడం లేదు. దీంతో చంటి పిల్లలు, వృద్దులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని సందర్బాలలో భక్తులకు ఊపిరి ఆడక కంపార్ట్మెంట్ల నుంచి దర్శనానికి వెళ్లకుండా బయటికి వచ్చిన సందర్బాలు అనేకం ఉన్నాయి. గంటల తరబడి క్యూ కంపార్ట్మెంట్లలో భక్తులు అవస్థలు పడుతున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.

ఇంకెన్నాళ్లు..రేకుల కంపార్ట్మెంట్లు!

ఇంకెన్నాళ్లు..రేకుల కంపార్ట్మెంట్లు!

ఇంకెన్నాళ్లు..రేకుల కంపార్ట్మెంట్లు!

ఇంకెన్నాళ్లు..రేకుల కంపార్ట్మెంట్లు!