
చిన్నారిపై వీధి కుక్క దాడి
బేతంచెర్ల: పట్టణంలోని బోయపేట కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారిపై వీధి కుక్కదాడి చేసి గాయపరిచిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పట్టణంలోని బోయపేట కాలనీకి చెందిన మధు, రామాంజనేయులు కుమార్తె మమత తోటి పిల్లలతో కలిసి ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటూ ఉంది. ఒక్క సారిగా వీధి కుక్క మమతపై దాడి చేసి కుడి కాలు, చేతిపై కరిచి తీవ్రగాయాలు చేసింది. పక్కనున్న వారు కేకలు వేయడంతో కుక్క పారిపోయింది. చిన్నారిని వెంటనే స్థానిక వైద్య శాలకు తరలించి వైద్యం చేయించారు. మే నెల 2వ తేదీన హనుమాన్ నగర్ కాలనీల్లో 4 సంవత్సరాల చిన్నారి బాలుడు షేక్ మొహిద్దీన్ కుక్కల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికై నా అధికారులు స్పందించి పట్టణంలోని వీధి కుక్కలను దూరంగా తరలించి చిన్నారులకు రక్షణ కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
మహిళా ఉద్యోగి ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం
ఓర్వకల్లు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా వెంకటాంపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి భార్య ముకుంద ప్రియ ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామ సచివాలయం–2లో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా రు. భర్త చంద్రారెడ్డి ఆర్మీకి వెళ్లడంతో కర్నూలులో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్ద ముకుంద ప్రియ నివాసముంటున్నారు. ఈమె ప్రతిరోజూ కర్నూలు నుంచి స్కూటీపై విధులకు హాజరచయ్యేవారు. ఈ క్రమంలో గత నెల 20వ తేదీన స్కూటీపై విధులకు వెళ్తుండగా రోడ్డుపై నిలబడిన లారీని ఢీకొట్టారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి రుక్మాంద రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునిల్ కుమార్ చెప్పారు.
నూతన వధువు ఆత్మహత్య
కోడుమూరు రూరల్: చెప్పులు కొనేందుకు భర్త డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఓ నూతన వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామంలో చోటు చేసుకుంది. మండలంలోని వర్కూరు గ్రామానికి చెందిన రామాంజినేయులు కుమార్తె శృతి (16)ని కోడుమూరుకు చెందిన నాగరాజుకు ఇచ్చి మేనెల 9న పెద్దలు వివాహం చేశారు. అప్పగింతలనంతరం ఈనెల 7న నూతన వధువు శృతి భర్త నాగరాజుతో కలిసి పుట్టినిల్లు అయిన వర్కూరు గ్రామానికి వెళ్లింది. అక్కడ శృతి తాను కొత్త చెప్పులు కొనేందుకు డబ్బులివ్వాలని భర్తను అడ్డుగగా, భర్త తానే కోడుమూరులో కొనిస్తానని చెప్పాడు. దీంతో భర్తపై అలిగి తీవ్ర మనస్తాపానికి లోనై శృతి అదే రోజు వాస్మోల్ ఆయిల్ తాగి అపస్మారక స్థితికి చేరుకోగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి తల్లి సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నారిపై వీధి కుక్క దాడి

చిన్నారిపై వీధి కుక్క దాడి