
టీడీపీ దాడులకు ఉసిగొల్పుతోంది
‘సాక్షి’ కార్యాలయాలకు రక్షణ కల్పించండి
కర్నూలు ఇన్చార్జి డీఎస్పీ శ్రీనివాస ఆచారికి వినతి
సాక్షి యూనిట్ కార్యాలయం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన
కర్నూలు(సెంట్రల్): ఉద్దేశ పూర్వకంగా సాక్షి మీడియా గ్రూపు కార్యాలయాలపై దాడులు చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి రక్షణ కల్పించాలని కర్నూలు ఇన్చార్జి డీఎస్పీ శ్రీనివాస ఆచారికి సాక్షి సిబ్బంది వినతిపత్రం సమర్పించారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డీఎస్పీని ఆయన కార్యాలయంలో కలసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సాక్షి బ్యూరో ఇన్చార్జ్లు రవికుమార్, లోకేష్ మాట్లాడుతూ రాజధాని అమరావతి అంశంపై ఇటీవల సాక్షి చానెల్లో ఓ పాత్రికేయుడు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని సాక్షి సమర్థించడంలేదని, ఆయన అభిప్రాయంతో తమ సంస్థ ఏకీభవించడం లేదన్నారు.
ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావుతోపాటు అభిప్రాయం వ్యక్తం చేసిన పాత్రికేయుడు సైతం ఈ అంశంపై విచారం వ్యక్తం చేశారన్నారు. ఈ వ్యవహారంతో సాక్షి గ్రూపునకు ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కుట్రపూరితంగా తన శ్రేణులను రెచ్చగొట్టి సాక్షి కార్యాలయాలపై దాడులకు ఊసిగొల్పుతోందన్నారు. ఇది పూర్తిగా ఆర్గనైజ్డ్ క్రైం కిందకు వస్తున్న నేపథ్యంలో తమ కార్యాలయాలకు రక్షణ కల్పించాలని వారు డీఎస్పీని కోరారు.
కొవ్వొత్తుల ప్రదర్శన
సాక్షి కార్యాలయాలపై జరిగిన దాడులను నిరసిస్తూ లక్ష్మీపురంలో ఉన్న సాక్షి యూనిట్ కార్యాలయ సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అన్ని విభాగాల సిబ్బంది కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలియజేశారు.