
‘రైతు సేవలకు’ మంగళం
● ఉమ్మడి జిల్లాలో మూతపడిన 162 ఆర్బీకేలు
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఈ నెల 12 నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఇప్పటి వరకు రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్య ఒక్కటంటే ఒక్కటీ లేదు. అయితే రైతుల దేవాలయాలుగా భావిస్తున్న ఆర్బీకేలను కూడా మూసి వేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ఒకటి కాదు, రెండు కాదు.. ఉమ్మడి జిల్లాలో ఏకంగా 162 ఆర్బీకేలను మూసి వేస్తోంది. ఎన్నికల సమయంలో సూపర్–6 పేరుతో ఆరు హామీలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. మొదటి ఏడాది ఆ ఊసే కరువైంది. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి రైతులు నెత్తిన భారం మోపారు. 2023 ఖరీఫ్, 2023–24 రబీ సీజన్, 2024 ఖరీఫ్ సీజన్లకు సంబంధించి ఉచిత పంటల బీమా పరిహారం ఎగవేశారు. రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీకేలను నామరూపాల్లేకుండా చేస్తుండటం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియ ముగిసింది. రేషనలైజేషన్ అంటే భూమి తక్కువగా ఉండి.. ఆర్బీకేలు ఎక్కువగా ఉంటే తగ్గిస్తారు. తగ్గించిన వాటిని భూమి ఎక్కువగా ఉండి ఆర్బీకేలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు మార్పు చేస్తారు. అయితే ఈ విధంగా చేయకుండా మూసి వేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 877 ఆర్బీకేలు(ఆర్ఎస్కేలు) ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 849 ఆర్బీకేలు ఉండగా... 28 ఆర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి. నేడు రూరల్, అర్బన్ ఆర్బీకేలు 715 మాత్రమే మిగిలాయి. అంటే 162 ఆర్బీకేలు ఇక కనిపించవు.కర్నూలు జిల్లాలో 466 ఆర్బీకేలు ఉండగా.. రేషనలైజేషన్ పేరిట రూరల్, అర్బన్ ఆర్బీకేలను 407కు కుదించారు. నంద్యాల జిల్లాలో 411 ఆర్బీకేలు ఉండగా.. నేడు 308కు తగ్గిపోవడం గమనార్హం.