
పాలన చేతకాక అక్రమ అరెస్టులు
కర్నూలు (టౌన్): సుపరిపాలన చేతకాక కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. పాలనా వైఫల్యాలపై ప్రశ్నించిన వారందరినీ అక్రమ అరెస్టు చేస్తూ ఇంకెన్ని రోజులు భయపెడతారని ఆయన ప్రశ్నించారు. ఎస్వీ కాంప్లెక్స్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమంగా కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి వేధించడం, జైళ్లకు పంపడం, భయాందోళనలకు గురి చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతకాకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారన్నారు. విద్యశాఖను సక్రమంగా నిర్వహించడం చేతకాని మంత్రి లోకేష్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి