
మేమింతే!
మహానంది: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పలు అభివృద్ధి పనులను అప్పటి ప్రజా ప్రతినిధులు భూమి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ పనులు చేసి ప్రారంభించాలి. ఇక్కడ కూటమి నేతలు అదే పనులకు మళ్లీ భూమి చేయడం పరిపాటిగా మారింది. ఇందుకు మహానంది క్షేత్రంలో జరిగిన కార్యక్రమమే నిదర్శనం. మహానంది దేవస్థానంలో రూ. 10.50 కోట్లతో 55 వసతి గృహాల నిర్మాణానికి 2024 ఫిబ్రవరి 14న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. టెండర్లు సైతం పిలవడం, దేవదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు వసతిగృహాల నిర్మాణానికి ప్లాన్లు సైతం పూర్తిచేశారు. కానీ ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మరోసారి సోమవారం అదే పనికి శంకుస్థాపన పేరుతో మరో కొత్త శిలాఫలకాన్ని వేసి పూజలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు తమ్మడపల్లె గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీజీఎఫ్ క్రింద రూ. కోటి మంజూరు కాగా గత ఏడాది మహానంది ట్రస్ట్బోర్డు అప్పటి చైర్మన్ కొమ్మా మహేశ్వరరెడ్డి, దేవదాయశాఖ అధికారులు భూమిపూజ చేశారు. మళ్లీ మరోసారి సోమవారం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఫరూక్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిలు భూమి పూజలు చేయడం విశేషం.
ప్రొటోకాల్ పాటించని మహానంది
ఆలయ అధికారులు
మహానంది దేవస్థానంలో సోమవారం జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేకపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి ఆహ్వానం లేదని, కనీసం ఫోన్ ద్వారా సమాచారం అందించలేదని మహానంది మండల జెడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వరరెడ్డి తెలిపారు. స్థానిక మహానంది సర్పంచ్ చలం చలం శిరీష, ఎంపీటీసీ సభ్యుడు బంగి వెంకటేశ్వర్లులను సైతం పిలవకపోవడం అధికారుల ఏకపక్ష తీరుకు అద్దం పడుతుందని విమర్శిస్తున్నారు.

మేమింతే!