
విద్యార్థులకు ‘షైనింగ్’ అవార్డులు
కర్నూలు సిటీ: నగర శివారులోని ఓ ఫంక్షన్ హాలులో పది, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుకు షైనింగ్ స్టార్స్ పేరుతో సోమవారం ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చే వారు కావాలన్నారు. ఆ తరువాత పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బి.దస్తగిరి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి. నవ్య, డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ పాల్గొన్నారు.
అస్తవ్యస్తం
● కార్యక్రమంలో కుర్చీలు వేసేందుకు సిబ్బంది లేరు. దీంతో కొంత మంది తల్లిదండ్రులు, విద్యార్థులే కుర్చీలు వేసుకోవాల్సి వచ్చింది.
● ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజనాలకు కొంత మంది విద్యార్థులకే టోకన్లు ఇచ్చారు. టోకన్లు అందకపోవడంతో కొంత మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.
● ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులు 500 మార్కులకుపైగా సాధించినా షైనింగ్ స్టార్స్ ఇవ్వలేకపోయారు. కొన్ని చోట్ల ఎంపికలో కచ్చితమైన నిబంధనలను పాటించకపోవడంతో పేదింటి బిడ్డలు షైనింగ్ స్టార్స్ కాలేకపోయారు.

విద్యార్థులకు ‘షైనింగ్’ అవార్డులు