
నీటి కుంటలో పడి బాలిక మృతి
చిప్పగిరి: ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఓ బాలిక మృతి చెందన సంఘటన దౌల్తాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలు, శకుంతలమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు రూప (10) ఉదయం పొట్టేలును మేపేందుకు గ్రామ సమీప పొలంలోకి వెళ్లింది. అక్కడ ఉన్న నీటి కుంటలో ప్రమాదవశాత్తూ జారి పడింది. అయితే పక్కనే ఉన్న తోట యజమాని దేవేంద్ర కుమారుడు బాలుడు నితిన్ గమనించి పరుగున వచ్చి కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు వెళ్లి చూడగా అప్పటికే రూప నీటిలో విగత జీవిగా కనిపించడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కొద్ది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం అయితే ఆరవ తరగతిలో చేరాల్సిన బాలిక అనంతలోకాలకు చేరడంతో గ్రామంలో విషాదం నెలకొంది.