
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
● కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై
మహిళల్లో ఆందోళన
● ఆడబిడ్డ నిధి పేరుతో మోసం
● ‘తల్లికి వందనం’ అంటూ వంచన
● సున్నా వడ్డీ రుణాలకు దిక్కేదీ?
● చంద్రన్న బీమాకు
మంగళం పలికినట్లేనా!
సంక్షేమాన్ని మరిచారు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం కింద బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఏడాదికి రూ.15,000 ప్రకారం చెల్లించాలి. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇప్పటి వరకు మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
– టి.కృష్ణవేణమ్మ, వర్షిణి గ్రూపు,
చెన్నంపల్లి, తుగ్గలి మండలం
మోసం చేశారు
ఆడబిడ్డనిధి కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ నెలకు రూ.1,500 ప్రకారం చెల్లిస్తామని మోసం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీల అమలుపై వెంటనే దృష్టి సారించాలి. – హసీనా, కోడుమూరు
అప్పుల ఊబి మిగిలింది
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఈ నెల 12వ తేదీతో ఏడాది పూర్తవుతోంది. ఇంతవరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. బ్యాంకుల నుంచి తీసుకునే లింకేజీ రుణాలు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు అమలు చేస్తామని ఇంతవరకు చేయలేదు. మహిళలు అప్పుల ఊబిలో కూరుకపోయారు. –బి.పద్మావతి, 19వ వార్డు, కర్నూలు
కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పటై ఏడాది పూర్తవుతున్నా మహిళా సంక్షేమానికి తీసుకున్న చర్య ఒక్కటంటే ఒక్కటీ లేదు. తరుణీమణులకు జీవనోపాధులను కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ నాయకులు 2014లో కూడా డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చాక మహిళలను మోసం చేశారు. 2024 ఎన్నికల సమయంలో కూడా మహిళల కోసం ప్రత్యేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కనపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీల్లో నిజాయితీ ఉండదు అని మహిళలు విమర్శిస్తున్నారు.
చంద్రబాబు హామీలు ఇవీ..
● ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ.. పేదరికం లేని సమాజం తీసుకువస్తాం’ అంటూ 2024 మే నెలలో ఎన్నికల ప్రచారసభలో టీడీపీ ఆధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.
● ‘ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకువస్తాం.. 18 నుంచి 59 ఏళ్లలోపు ప్రతి మహిళకు నెలకు రూ.1500 చెల్లిస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ వర్తింప చేస్తాం’ అని ప్రకటించారు.
● అమ్మకు వందనం కింద ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15,000 నేరుగా ఆడబిడ్డల బ్యాంకు ఖాతాలో వేస్తాం అని హామీ ఇచ్చారు
● ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని సూపర్–6 హామీల్లో ఘనంగా చెప్పారు.
● ‘ఇంతకు ముందు జనాభా నియంత్రణ కోసం ఒకరిద్దరితో సరిపుచ్చుకోమని చెప్పా.. ఇపుడు చెబుతున్నా... ముగ్గురు, నలుగురు ఆడబిడ్డలను కనండి... అడబిడ్డల భవిత్వం నేను చూసుకుంటా’ అని టీడీపీ అధినేతగా చంద్రబాబు హామీ ఇచ్చారు.
● ప్రమాదవశాత్తు జరిగే మరణాలకు రూ.10 లక్షలకు, సహజ మరణాలకు రూ.5 లక్షలకు బీమా సదుపాయం కల్పిస్తామని మహిళలకు హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక ఇలా చేశారు..
● అధికారంలోకి వచ్చాక మహిళా సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు మరచిపోయారు. సీఎం పర్యటనలకు మహిళలే అవసరం. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి సభలు, సమావేశాలకు తరలిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మాత్రం అమలు కావడం లేదు.
● ఆడబిడ్డనిధి గురించి 2025–26 బడ్జెట్లో ప్రస్తావనే లేదు. ఈ పథకాన్ని అమలు చేయరని మహిళల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
● తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు.
● ఉచిత బస్సు ప్రయాణం చేస్తామని చెప్పినా దానిపై స్పష్టత కరువైంది.
● జిల్లాలో 49,255 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 5.10 లక్షల మంది మహిళలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావచ్చినప్పటికీ సున్నావడ్డీ రుణాల జాడనే లేకుండా పోయింది. 2024–25లో 45 వేల స్వయం సహాయక సంఘాల మహిళలు రూ.1,800 కోట్ల వరకు లింకేజీ రుణాలు పొందారు. సున్నా వడ్డీ జాడా లేకపోవడంతో మహిళలపై వడ్డీ భారం పడుతోంది.
● టీడీపీ కార్యకర్తలకు ఎన్టీఆర్ ట్రస్ట్ కింద ప్రమాద బీమా కల్పించిన చంద్రబాబు సామాన్య, మధ్య తరగతి కుటంబాలను గాలికి వదిలేశారు. వైఎస్సార్ బీమాను చంద్రన్న బీమాగా పేరు మార్చడం మినహా ఎటువంటి పురోగతి లేదు. చంద్రన్న బీమా కోసం కర్నూలు జిల్లాలో 3,500, నంద్యాల జిల్లాలో 2,800 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఏడాది అవుతున్నప్పటికీ చంద్రన్న బీమా అమలు కాలేదు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళల సంక్షేమానికి అందించిన ఆర్థిక సహాయం
పథకం లబ్ధిపొందిన మహిళలు ప్రయోజనం పొందిన
ఆర్థిక లబ్ధి (రూ.కోట్లలో)
వైఎస్సార్ ఆసరా 2,49,976 568.28
వైఎస్సార్ చేయూత 1,24,045 905.80
సున్నా వడ్డీ రుణాలు 29,520 (గ్రూపులు) 140.36
వైఎస్సార్ బీమా 4,578 45.49
జగనన్న తోడు 92,739 126.81
కళ్యాణమస్తు, షాదీతోఫా 2,952 23.71
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసింది. 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళల సంక్షేమం లక్ష్యంగా పలు పథకాలు అమలు చేశారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు, కళ్యాణమస్తు– షాదితోఫా, సున్నా వడ్డీ రుణాలు, వైఎస్సార్ బీమా పథకాలను పకడ్బందీగా అమలు అయ్యాయి. ఈ పథకాల కింద ఐదేళ్లలో మహిళలకు రూ.1810.45 కోట్ల మేర ప్రయోజనం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా.. మహిళల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. దీంతో మహిళలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. మహిళల్లో కొనుగోలు సామర్ధ్యం భారీగా పడిపోయింది.

వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..

వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..

వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..

వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..