
అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): అర్జీదారులు సంతృప్తి చెందేలా వినతులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్)లో భాగంగా కలెక్టర్ పి.రంజిత్బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలకు నిర్దేశిత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. మండలాల ప్రత్యేకాధికారులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శించి సమస్యలను తెలుసుకోవాలన్నారు. తనిఖీల వివరాలను గ్రామల వారీగా తనకు అందించాలని సూచించారు.
డ్రోన్ ధర రూ.10 లక్షలా!
● బహిరంగ మార్కెట్లో
బ్యాటరీ సహా రూ.8 లక్షలే..
● కొనుగోలుకు ముందుకురాని గ్రూపులు
కర్నూలు(అగ్రికల్చర్): పలు కంపెనీల డ్రోన్లు బహిరంగ మార్కెట్లో రూ.8 లక్షలకే లభిస్తున్నాయి. బ్యాటరీ లేకుండా అయితే రూ.6 లక్షలు, బ్యాటరీతో కలిపి రూ.8 లక్షలకే క్వాలిటీ డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వ్యవసాయ శాఖ అందజేస్తున్న డ్రోన్ల ధరలో భారీగా వ్యత్యాసం ఉండటం చర్చనీయాంశమైంది. వ్యవసాయ శాఖ సరఫరా చేస్తున్న డ్రోన్ల యూనిట్ కాస్ట్ రూ.9.81లక్షలు. ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తోంది. జిల్లాలో విహంగ, డ్రోగో కంపెనీలు కిసాన్ డ్రోన్లను సరఫరా చేస్తున్నాయి. యూనిట్ కాస్ట్లో ఎఫ్ఎంజీ కిసాన్ డ్రోన్ గ్రూపులు 50 శాతం చొప్పున రూ.4.90 లక్షల ముందుగానే చెల్లించాల్సి ఉంది. మిగిలిన 50 శాతం బ్యాంకు లోన్ కింద సమకూరిస్తేనే యూనిట్ గ్రౌండ్ అవుతుంది. జిల్లాకు 35 డ్రోన్లను మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో ఐదు గ్రూపులు మాత్రమే 50 శాతం మొత్తాన్ని చెల్లించాయి. సిబిల్ స్కోర్ కారణంగా బ్యాంకుల నుంచి లోన్ పొందడం గగనమవడం.. యూనిట్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉండటం పట్ల గ్రూపు సభ్యుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సబ్సిడీ విత్తనాలకు
రైతుల పేర్లు నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): విత్తనాల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో వ్యవసాయ శాఖ స్పందించింది. సబ్సిడీపై వేరుశనగ, పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు, ఇతర విత్తనాలు పొందేందుకు రైతులు వెంటనే సంబంధిత రైతుసేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు సంబంధించి కర్నూలు జిల్లాకు 10,261.50 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 8,766 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించింది. వేరుశనగతో సహా విత్తనాల కోసం ఆర్ఎస్కేల్లో పేర్లు నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. రైతులు నాన్ సబ్సిడీ చెల్లించి వేరుశనగ పొందవచ్చని సూచించారు. ఒక రైతుకు వేరుశనగ సాగుచేసే భూమిని బట్టి గరిష్టంగా 10 ప్యాకెట్లు( మూడు క్వింటాళ్లు) ఇస్తారు. కిలో పూర్తి ధర రూ.93 ఉండగా.. 40 శాతం సబ్సిడీ ఉంటుంది. ఒక ప్యాకెట్లో 30 కిలోల వేరుశనగ విత్తనం కాయలు ఉంటాయి. ప్యాకెట్ పూర్తి ధర రూ.2,790 ఉండగా.. సబ్సిడీ రూ.1,116 ఉంటుంది. సబ్సిడీ పోను రైతులు రూ.1,674 చెల్లించాల్సి ఉంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు కోరారు.
ఎరువులు తరలిపోకుండా తనిఖీలు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ మొదలైన నేపథ్యంలో జిల్లా నుంచి రసాయన ఎరువులు ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా బార్డర్ చెక్పోస్టుల్లో తనిఖీలు చేపట్టేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ రంజిత్బాషా ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు మండలంలో పంచలింగాల, మంత్రాలయం మండలంలో మాధవరం, హాలహర్వి మండలంలో చింతకుంట, కౌతాలం మండలంలో బాపురం, ఆదోని మండలంలో పెద్దహరివాణం గ్రామాల్లో బార్డర్ చెక్పోస్టులు ఉన్నాయి. జిల్లాకు వచ్చిన ఎరువులను హోల్సేల్ డీలర్లు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు తరలించే ప్రమాదం ఉన్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. రసాయన ఎరువులు ఇతర రాష్ట్రాలకు తర లించడాన్ని సమూలంగా నిర్మూలించేందుకే ప్ర త్యేక టీములు ఏర్పాటయ్యాయి. ప్రతి చెక్పోస్టు ప్రత్యేక టీమ్లో డిప్యూటీ తహసీల్దారు, మండల వ్యవసాయ అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటారు.