మౌలిక సదుపాయాలు.. ఎప్పుడో? | - | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాలు.. ఎప్పుడో?

Jun 3 2025 5:35 AM | Updated on Jun 3 2025 5:35 AM

మౌలిక

మౌలిక సదుపాయాలు.. ఎప్పుడో?

సున్నిపెంటలో శ్రీశైల దేవస్థాన సిబ్బందికి వసతి గృహ సముదాయాలు

రూ.39 కోట్లతో 297 గృహాలతో క్వార్టర్స్‌

అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాల కల్పనకు చర్యలు

దేవదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు.. త్వరలో టెండర్లు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం ఉద్యోగులకు వసతి గృహ సముదాయాల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సున్నిపెంట గ్రామంలో ఇరిగేషన్‌ శాఖకు చెందిన స్థలాన్ని దేవస్థానం బదలాయించి ఆ ప్రదేశంలో వసతి గృహాలను నిర్మించింది. ఏ, బీ, సీ మూడు బ్లాకులుగా విభజించి మొత్తం 297 గృహలను రూ.39 కోట్ల వ్యయంతో నిర్మించారు. అయితే దేవస్థాన వసతి సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

మూడు బ్లాకుల్లో 297 గృహాలు

శ్రీశైల దేవస్థానం రెగుల్యర్‌ ఉద్యోగులు సుమారు 260 మంది ఉంటారు. వీరికోసం ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలోని సున్నిపెంటలో ఇరిగేషన్‌ శాఖకు చెందిన 20 ఎకరాలలో వసతి గృహ సముదాయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మూడు బ్లాకులుగా విభజించి క్వార్టర్స్‌ నిర్మాణాలు చేపట్టారు. ఏ–బ్లాకులో మొత్తం 4 భవనాలు ఉన్నాయి. ఒక్కొ భవనంలో 27 గదులు నిర్మిస్తున్నారు. ఈ గృహాలను అటెండర్లు, వాచ్‌మన్లు, కిందిస్థాయి సిబ్బంది (నాల్గవ తరగతి ఉద్యోగుల) కోసం ఎకనామీ క్లాస్‌గా నిర్మించారు. అలాగే బి–బ్లాకులో మొత్తం నాలుగు భవనాలు ఉన్నాయి. ఒక్కో భవనంలో 27 గదులు నిర్మించారు. సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు తదితరుల కోసం నిర్మించారు. ఇందులో సింగిల్‌ బెడ్‌రూం, హాలు, కిచెన్‌ ఉంటాయి. అలాగే సీ–బ్లాకులో మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. ఒక్కో భవనంలో 27 గదులు నిర్మించారు. రెండు బెడ్‌ రూంలు, హలు, కిచెన్‌ ఉండేలా నిర్మించారు. సూపరింటెండెంట్‌, సహాయ కార్యనిర్వహణాధికారి తదితర వారి కోసం నిర్మిస్తున్నారు. ఏ, బీ, సీ బ్లాకులలో మొత్తం 297 వసతి గృహలు నిర్మించారు. ఆయా గృహాల సముదాయాల నిర్మాణ పనులను కాంట్రాక్టర్‌ పూర్తిచేసి, దేవస్థానానికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు.

అదనపు సౌకర్యాలకు ప్రతిపాదనలు

దేవస్థాన ఉద్యోగుల క్వార్టర్స్‌లో అంతర్గత రోడ్లు నిర్మించాల్సి ఉంది. అలాగే అటవీ జంతువులు రాకుండా చుట్టూ ఫెన్సింగ్‌, తాగునీటి కోసం శ్రీశైలం డ్యాం నుంచి పైప్‌లైన్‌, స్టోరేజ్‌ ట్యాంకులు, విద్యుత్‌ సౌకర్యం కోసం ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆయా పనులకు టెండర్లు పిలిచేందుకు ఇంజినీరింగ్‌ అధికారులు దేవదాయశాఖ కమిషనర్‌ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. చీఫ్‌ ఇంజినీర్‌ స్వయంగా క్షేత్రానికి వచ్చి పరిశీలించి అనుమతులిస్తారు.

ఆగస్టుకంతా ఉద్యోగస్తులను తరలిస్తాం

శ్రీశైల దేవస్థానం ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న వసతి గృహ సముదాయం పనులు దాదాపు పూర్తయ్యాయి. క్వార్టర్స్‌లో తాగునీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం, అంతర్గత రహదారులు, డ్రైనేజ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తాం. ఇప్పటికే వసతి గృహ సముదాయాన్ని ఐఐటీ నిపుణులు పరిశీలించారు. త్వరలో లాటరీ పద్ధతిలో ఉద్యోగులకు గృహాలు కేటాయిస్తాం. విద్యుత్‌ అంతరాయం లేకుండా 33/11 కె.వి.సబ్‌స్టేషన్‌ను సైతం ఏర్పాటు చేయబోతున్నాం. ఆగస్టు నెల చివరి నాటికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తాం. ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు ఇబ్బందులు లేకుండా శ్రీశైలం నుంచి వసతి గృహాల వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. – ఎం.శ్రీనివాసరావు,

శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి

మౌలిక సదుపాయాలు.. ఎప్పుడో?1
1/1

మౌలిక సదుపాయాలు.. ఎప్పుడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement