ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయనగరానికి చెందిన భక్తులు ఆదివారం బంగారపు నత్తు, బొట్టు, బొల్లాకిని కానుకగా సమర్పించారు. విజయనగరం జిల్లా గాజుల రేగకు చెందిన కె. సత్యనారాయణ, అప్పాయమ్మ దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. రూ.2.50లక్షల వ్యయంతో సుమారు 19 గ్రాముల బంగారాన్ని వినియోగించి బొట్టు, నత్తు, బొల్లాకిని తయారు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకులు నాగేశ్వరరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
5న మెగా జాబ్ మేళా
గుడివాడ టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 5న గుడివాడలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక పాత కరెంట్ ఆఫీస్ రోడ్డులోని ముగ్గుబజారు సెంటర్ నందుగల రెడ్సన్ ఫౌండేషన్ నందు ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9848819682, 9666654641లలో సంప్రదించవలసినదిగా కోరారు.
ఇంద్రకీలాద్రిపై సంకట హర చతుర్థి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సంకట హర చతుర్థిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ఆదివారం గణపతికి విశేష అభిషేకాలు, పూజలు, హోమాలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో గణపతి ఉత్సవ విగ్రహానికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణ, గరికెతో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో గణపతి హోమాన్ని నిర్వహించగా, పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
శివాలయంలో శాకంబరీ ఉత్సవాలు
పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని భ్రమరాంబ అమ్మవారిని ఆదివారం శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రైప్రూట్స్, సుగంధ ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించారు. అంత్రాలయం, ఆలయ ప్రాంగణం, ధ్వజస్తంభం వద్ద పండ్లు, ఆకుకూరలు, కూరగాయల తోరణాలతో అలంకరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షణలో శాకంబరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


