● రాకపోకలకు ఇబ్బందులు పడిన ప్రయాణికులు
● చల్లపల్లి సెంటర్లో
తెలుగు తమ్ముళ్ల బలప్రదర్శన
చల్లపల్లి: తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుధవారం నిర్వహించిన ర్యాలీతో కృష్ణాజిల్లా చల్లపల్లి సెంటర్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్ప డింది. గంటల తరబడి ప్రధాన సెంటర్లో డీజేలు పెట్టుకుని తెలుగు తమ్ముళ్లు గుమిగూడటంతో పలువురు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో స్కూళ్లు, కళాశాలలు వదలడంతో కొంతమేర రద్దీ ఏర్పడింది. ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాసరావును టీడీపీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన సందర్భంగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో ప్రారంభమైన ర్యాలీ కొడాలి మీదుగా చల్లపల్లికి చేరుకుంది. ర్యాలీలో పాల్గొనని కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలను కూడగట్టుకుని చల్లపల్లి ప్రధాన సెంటర్లో బల ప్రదర్శనకు పూనుకున్నారు. దీంతో వాహనాలను పడమర వీధి నుంచి పాగోలు శ్రీనగర్ మీదుగా మళ్లించారు. రోగిని ఆస్పత్రికి తీసుకువెళుతున్న ఓ మినీ అంబులెన్స్ పామర్రు నుంచి పులిగడ్డ వెళ్లేందుకు చల్లపల్లి ప్రధాన సెంటర్కు వచ్చింది. ర్యాలీ కారణంగా ప్రధాన సెంటర్ నుంచి అవనిగడ్డ వైపు మార్గం వాహనాలతో నిండిపోవటంతో అంబులెన్స్కు ముందుకు వెళ్లే దారిలేకుండా పోయింది. వాహనంలోని పేషెంటును పులిగడ్డలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళుతున్నట్లు అందులో ఉన్న వారు తెలిపారు. ముందుకు వెళ్లే దారి లేక అంబులెన్స్ను వెనుకకు తిప్పి నడకుదురు రోడ్డులో నుంచి శ్రీనగర్ మీదుగా తీసుకెళ్లారు.


