చందర్లపాడు(నందిగామ రూరల్): చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారని శాసన మండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. టీడీపీ మూకల దాడిలో గాయపడిన చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన రావూరి చిన్నా, మద్దిపట్ల సాంబశివరావులను ఆదివారం ఆయన పరామర్శించి దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరుణకుమార్ మాట్లాడుతూ యావత్ దేశం మొత్తం భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తేంటే రాష్ట్రంలో మాత్రం రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. దాడులకు పాల్పడుతున్నా పోలీసులు సైతం అధికార పార్టీ నేతల వత్తిళ్లతో కనీస చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు.
చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అరుణకుమార్ డిమాండ్ చేశారు. అధికార వత్తిళ్లకు తలొగ్గి చర్యలు తీసుకోకుంటే పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అప్పుడు కూడా స్పందించకుంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్య పడొద్దని పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ కందుల నాగేశ్వరరావు, నాయకులు వెలగపూడి వెంకటేశ్వరరావు, వైఎస్ఎన్ ప్రసాద్, చింతోటి ప్రసాద్, నల్లాని సాయి, మద్దుకూరి సాయిబాబు, ఓర్సు కొండ, షేక్ కరిముల్లా పాల్గొన్నారు.


