సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు ఏబీ వెంకటేశ్వరరావు, చక్రవర్తి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం 22ఏ బాధితులకు ఉపశమనం కల్పించేందుకు తెచ్చామని చెబుతున్న జీవో 444 ఓ చెత్త జీవో అని సెంటర్ ఫర్ లిబర్టీ కొట్టి పారేసింది. తక్షణమే 22–ఏ జాబితాను రద్దు చేసి భూములను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. శనివారం విజయవాడ ప్రెస్క్లబ్లో 22 ఏ బాధితులతో కలిసి సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, చక్రవర్తి మీడియా సమావేశంలో మాట్లాడారు. నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతులు మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా నల్లమోతు చక్రవర్తి మాట్లా డుతూ 22ఏ బాధితుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలా డుకుంటుందోని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇనాం భూములకు విముక్తి కల్పిస్తామని అనేక సభల్లో ప్రకటించారని గుర్తు చేశారు. ఆయన చెప్పిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ఆవులపల్లె జీవో మోడల్ను రాష్ట్రం అంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జీవో 444 ప్రతులను చించివేశారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, అజయ్ మల్లారెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకొంటున్న తల్లికి వందనం పథకం అమలులో ఎన్నో లోపాలు వెలుగు చూస్తున్నాయి. మచిలీ పట్నం రూరల్ మండలం, పోట్లపాలెం గ్రామానికి చెందిన గాజుల శివన్నారాయణ, హేమలత దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారి కుమారుడు శ్రావణ్ కుమార్ ఎనిమిదో తరగతి, కుమార్తె మానసాదేవి ఆరో తరగతి చదువుతున్నారు. అర్హులైనప్పటికీ వారికి తల్లికి వందనం పథకం అంద లేదు. పోతిరెడ్డిపాలెం సచివాలయంలో ఆరా తీయగా, ఆ దంపతుల పేర్లపై సుమారు 30 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఆన్లైన్లో నమోదైందని అధికారులు చెప్పడంతో వారు విస్తుపోయారు. నెలకుర్రు, మచిలీపట్నం, పోలాటితిప్ప, గోపువానిపాలెం, కానూరు, పల్లెతుమ్మలపాలెం గ్రామాల్లో తమ పేరిట భూములు ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయని, వాస్తవానికి తమకు ఒక్క సెంటు భూమి కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా పథకం అందలేదని, ఆప్పుడే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించనందున ఈ ఏడాదీ తమకు లబ్ధి చేకూరలేదని శివన్నారాయణ, హేమలత దంపతులు వాపోయారు.


