రూ.1.36 కోట్లకు కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు గతం కంటే 35 శాతం అధికం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తులు సమర్పించే కొబ్బరి చిప్పలను పోగు చేసుకునే హక్కు కోసం దేవస్థానం గురువారం టెండర్ పక్రియను నిర్వహించింది. విజయవాడకు చెందిన సంకబత్తుల నాగ వైష్ణవి బహిరంగ వేలం పక్రియ ద్వారా టెండర్కు రూ. 1.35 కోట్లకు దక్కించుకున్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన మహా మండపం ఆరో ఆంతస్తులో టెండర్ పక్రియ జరిగింది. టెండర్ పక్రియను ఆలయ ఈవో శీనానాయక్, ఛైర్మన్ రాధాకృష్ణ, డీఈవో కిషోర్కుమార్లు పర్యవేక్షించారు. రూ.10 లక్షల ప్రథమ దరావత్తుగా టెండర్ పక్రియ ప్రారంభం కాగా, 5 గురు కాంట్రాక్టర్లు డిపాజిట్ను చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొన్నారు. దేవస్థానం పాటను రూ. 1.10 కోట్ల నుంచి ప్రారంభించింది. తొలుత కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో పాటను రూ. నాలుగు లక్షలు తగ్గించి రూ.1.06 కోట్ల నుంచి ప్రారంభించారు. విజయవాడకు చెందిన సంకబత్తుల నాగ వైష్ణవి, కాకినాడకు చెందిన పవన్ సూర్య ట్రేడర్స్, విజయవాడకే చెందిన వీఎల్డీ ట్రేడర్స్, కరిష్మా ఇంటిరీయల్, సీఎస్ఆర్ ఎంటర్ప్రైజర్స్, నాగ వైష్ణవి ట్రేడర్ బహిరంగ వేలంలో పాల్గొన్నారు. పాటను కాంట్రాక్టర్టు పోటీ పడి పెంచుతూ చివరకు నాగ వైష్ణవి ట్రేడర్స్, నాగ వైష్ణవిల మధ్య పోటాపోటీగా సాగింది. చివరకు నాగ వైష్ణవి రూ. 1,36,50,000కు పాటను దక్కించుకున్నారు. ఇక సీల్డ్ టెండర్లో కాకినాడకు చెందిన పవన్సూర్య ట్రేడర్ రూ. 1,19,99, 989, సీఎస్ఆర్ ఎంటర్ప్రైజర్స్ రూ. 90 లక్షలకు దాఖలు చేశారు. ఇక ఈ టెండర్లో పవన్ సూర్య ట్రేడర్స్ రూ. 1.22 కోట్లకు దాఖలు చేయగా, మూడు పక్రియలలో బహిరంగ వేలం ద్వారా అత్యధిక మొత్తంలో టెండర్ను సంకబత్తుల నాగ వైష్ణవి దక్కించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. టెండర్ ఏడాది కాలపరిమితికి జరిగిందని, రానున్న ఏడాది పది శాతం అదనంగా పాటతో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది రూ. 1.01 కోట్లకు పలకగా, ఈ ఏడాది 34.56 శాతం అధికంగా టెండర్ పలకడం విశేషమని అధికారులు పేర్కొన్నారు. టెండర్ పక్రియను ఆలయ ఎఈవో ఎన్. రమేష్బాబు పర్యవేక్షించగా, ట్రస్ట్ బోర్డు సభ్యుల సమక్షంలో నిర్వహించారు.


