ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు బుధవారం విరాళాలు అందజేశారు. విజయవాడ గాంధీనగర్కు చెందిన దిట్టకవి వెంకట సుబ్బరాయ్ శర్మ తన తల్లి అలివేలు పేరిట అమ్మవారి అన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అలాగే విజయవాడకు చెందిన పర్వతం గోపీచంద్ తన భార్య భరణి పేరిట అన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాసరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు.
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశానికి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించామని ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్, విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పది, 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన కోరారు. అర్హులైన అభ్యర్థులు ఐటీఐ అడ్మిషన్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో గానీ, ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు స్వయంగా వచ్చి ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయాలనన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 6 గంటల లోగా ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్ దరఖాస్తు చేయడంలో సహాయం కోసం విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, వివరాలకు సెల్: 94906 39639 నంబర్ను సంప్రదించాలని కోరారు.
పారా స్పోర్ట్స్ ఓవరాల్ చాంప్ కృష్ణా
మచిలీపట్నం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష, పీఎం శ్రీ, రాష్ట్ర సహిత విద్యా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో అగిరిపల్లి మండలం తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్ పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్ ఫర్ సీడబ్ల్యూఎస్ఎన్ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. భరణి కృష్ణా జిల్లా దివ్యాంగ విద్యార్థులకు ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని అందజేశారు. పోటీలో్ల్ జిల్లా దివ్యాంగ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో పతకాలు సాధించారు. గూడూరు మండలానికి చెందిన అమీనా తబస్సుమ్ షాట్పుట్, 400 మీటర్ల పరుగు, లాంగ్ జంప్లో పతకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయి ఎంపిక రిలే పోటీలో ప్రథమస్థానం దక్కించుకుంది. అలాగే వినుకొండ భరత్బాబు, మహమ్మద్ ఆనస్, మురాల రోహిత్, ఎం. తేజశ్రీ దుర్గ కూడా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు కీర్తి తెచ్చారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, సహిత విద్య ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆర్.కుముదిని సింగ్, జిల్లా సహిత విద్య సమన్వయకర్త కళ్లేపల్లి ఏడుకొండలు అభినందించారు.


